న్యూయార్క్: అమెరికాలోని న్యూయార్క్ మ్యాన్హటన్లోని గ్రాండ్ సెంట్రల్ టెర్మినల్లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ట్రైన్ కోసం 7ట్రైన్ స్టాప్ వద్ద నిల్చున్న ఓ వ్యక్తికి సంబంధించిన వస్త్రాలు రైల్లో ఇరుక్కుపోవడంతో ట్రైన్ అతడ్ని ఈడ్చుకెళ్లింది. దీంతో అతడు టన్నెల్లో పడిపోయాడు. తీవ్రగాయాలపాలైన అతడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ మేరకు వాషింగ్టన్ పోస్టు తన కథనంలో పేర్కొంది.
న్యూయార్క్ పోలీస్ డిపార్ట్మెంట్ అధికారి ఈ ఘటనపై మాట్లాడుతూ.. సబ్వే ప్లాట్ఫాం చివరలో ఓ వ్యక్తి నిల్చున్నాడని, అంతలోనే వచ్చిన ట్రైన్.. అతడ్ని ఈడ్చుకెళ్లిందని తెలిపారు. అతడు వేసుకున్న దుస్తులు ట్రైన్లో ఇరుక్కుపోవడంతో ఈ ఘటన జరిగిందని చెప్పారు.
మంగళవారం రాత్రి 7.20గంటలకు ఈ ఘటన జరిగిందని, సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారని తెలిపారు. మృతుడి వయస్సు 39ఏళ్లు ఉండొచ్చని చెప్పారు. అయితే, తీవ్రగాయాలపాలైన అతడ్ని అక్కడివారు ఎవరూ గుర్తించలేకపోయారని తెలిపారు.
ఈ ఘటన ఎలా జరిగిందన్న దానిపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు, రైల్వే అధికారులు తెలిపారు. ఘటన జరిగిన సమయంలో స్టేషన్లో రద్దీ కూడా లేదని చెప్పారు. రైలు కదులుతున్న సమయంలో బాధితుడు ఎక్కేందుకు ప్రయత్నించాడని, ఈ క్రమంలోనే అతడు ప్రమాదానికి గురయ్యాడని చెప్పారు.
ట్రైన్ లాక్కెళ్లడంతో అతడి శరీరం ఎలక్ట్రిక్ బాక్సులో ఇరుక్కుపోయిందని, ఫ్లాష్ రావడంతో ప్రమాదాన్ని ట్రైన్ ఆపరేటర్లు గుర్తించారని మరో లా ఎన్ఫోర్స్మెంట్ అధికారి న్యూయార్క్ టైమ్స్కు తెలిపారు. ఈ మేరకు సీసీటీవీ ఫుటేజీలో రికార్డైందని వెల్లడించారు. కాగా, ఈ ప్రమాదం కారణంగా పలు రైళ్లు నిలిచిపోయాయి. ఇలాంటి ఘటనలు గతంలోనూ చోటు చేసుకున్నాయి. 2016లో 48మంది ప్రయాణికులు ట్రైన్, ప్లాట్ఫాంకి మధ్య ఇరుక్కుపోయి తీవ్రగాయాలపాలయ్యారు.