తెలంగాణాలో రోజురోజుకూ అదృశ్యమవుతున్నవారి సంఖ్య పెరుగుతున్నది. గత వారం రోజుల్లోనే రెండు వందల మందికి పైగా మిస్సింగ్ కేసులు నమోదుకావడంతో పాటు వీరిలో పలువురి మృత దేహాలు వివిధ నిర్మనుష్య ప్రాంతాలో వెలుగుచూడటం ఆందోళన కలిగిస్తున్నది. నేపథ్యంలోనే ఇటీవల కనిపించకుండా పోయిన ఓ ప్రయివేటు ఉద్యోగిని మృత దేహం కనిపించింది.
ఆ ఉద్యోగిని అతికిరాతకంగా హత్య చేసి.. ఓ ప్లాస్టిక్ సంచిలో మూటగట్టి నిజమాబాద్ లోని ఓ అడవి ప్రాంతంలో పడేసిపోయిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ నెల 27న స్థానికులు మృత దేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. మోపాల్ మండలం మంచిప్ప గ్రామ పరిధిలోని అటవీ ప్రాంతంలోని ఘటనాస్థలికి పోలీసులు చేరుకుని పరిశీలించారు. అతి దారుణంగా హింసించి ఆ వ్యక్తి ప్రాణాలు తీసినట్టుగా తెలుస్తోంది. మృత దేహం కుళ్లిపోయి దుర్వాసన రావడంతో స్థానికులు గుర్తించారు.
ఈ ఘటనపై కేసు నమోదుచేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మరీ ముఖ్యంగా మృత దేహంపై కత్తిపోట్టు ఉండటం, అతి క్రూరంగా హింసించినట్టు తెలిపే గాయాలు ఉండటంతో పోలీసులు మరింత సీరియస్గా తీసుకున్నారు. ఈ క్రమంలోనే ఆ ప్రాంతం చుట్టూపక్కల పరిసరాల్లో ఉన్న సీసీ టీవీ ఫుటేజీని పరిశీలించగా.. ఇద్దరు వ్యక్తులు ఆ మృత దేహాన్ని ఓ ప్లాస్టిక్ సంచిలో మూటకట్టి… దానిని తమ బైక్ పై పెట్టుకుని అటవీ ప్రాంతం వైపు వెళ్తున్న దృశ్యాలను పోలీసులు గుర్తించారు. ఆ దుండగులు ఎవరనేదానిపై పోలీసులు వెతుకుతున్నారు.
కాగా, మృతుడిని నిజమాబాద్ జిల్లాలోని సాయినగర్కు చెందిన ప్రయివేటు ఉద్యోగిగా పోలీసులు గుర్తించారు. అతను స్థానికంగా ఉన్న ప్లాస్టిక్ వస్తువల తయారీ పరిశ్రమలో సేల్స్ మెన్గా పనిచేస్తున్నాడు. ఓ సాధారణ వ్యక్తిని ఇంత దారుణంగా చంపాల్సిన అవసరమేముంటుదనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అలాగే, ఇదివరకు ఎవరితోనైన కలహాలు ఉన్నాయ అనే కోణంలోనూ విచారణ జరుపుతున్నారు.