హైదరాబాద్: పని మనిషిపై అత్యాచారం చేసిన కేసులో 13 ఏళ్ల తర్వాత ఒక వ్యక్తికి పదేళ్ల జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు వెలువరించింది. అతనికి సహకరించిన భార్యకు జరిమానా విధించింది.
బంజారాహిల్స్ రోడ్ నం.12లోని మిథిలానగర్ లో ఉండే వహీద్ ఖాన్ అనే వ్యక్తి అమెరికాలోని కాలిఫోర్నియాలో కొంతకాలం ఉద్యోగం చేశాడు. అనంతరం హైదరాబాద్కు తిరిగొచ్చాడు. గుంటూరు జిల్లా నల్లచెరువు ప్రాంతానికి చెందిన ఒక యువతి 2006లో వీరింట్లో పనిమనిషిగా చేరింది.
ఇంట్లోనే ఉంటూ తోట పని, ఇంటి పనులు చూసుకునేది. యువతిపై కన్నేసిన వహీద్ ఖాన్ ఇంట్లో రహస్య కెమెరాలు ఏర్పాటు చేశాడు. భర్త పనిమనిషిపై కన్నేసిన విషయం గ్రహించిన వహీద్ ఖాన్ భార్య అతన్ని మందలించడం మానేసి, భర్తకు సహకరించడం మొదలెట్టింది. భార్య సహకారంతో వహీద్ బాత్రూమ్లో సిసిటివి కెమెరాలు ఏర్పాటు చేశాడు. పనిమనిషి స్నానం చేస్తున్న దృశ్యాలను రికార్డు చేశాడు. ఆ వీడియోలు చూస్తూ వహీద్ ఖాన్ పైశాచిక ఆనందం పొందేవాడు.
ఒక రోజు పని మనిషి కడుపునొప్పిగా ఉందని వహీద్ఖాన్ భార్యకు చెప్పగా ఆమె మాత్రలు ఇచ్చింది. అవి వేసుకుని నిద్రలోకి జారుకున్నాక వహీద్ పని మనిషిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. నిద్రలేచేసరికి నగ్నంగా మంచంపై పడి ఉండటంతో తనకేం అయ్యిందని పని మనిషి వహీద్ఖాన్ భార్యను అడగ్గా నిద్రలో బట్టలు లేకుండా పడుకున్నావంటూ చెప్పుకొచ్చింది.
తర్వాతి రోజు కూడా వహీద్ ఖాన్ భార్య ఇచ్చిన టీ తాగిన పనిమనిషికి మళ్లీ ఇలాగే జరిగింది. అనుమానం వచ్చిన పనిమనిషి వహీద్ ఖాన్ను, అతని భార్యను నిలదీసింది.
దీంతో వహీద్ ఖాన్ ఆమెకు బాత్రూంలో స్నానం చేస్తున్న దృశ్యాలు చూపించి బెదిరించాడు. యువతి భయపడడంతో అదే అదనుగా పలుమార్లు అత్యాచారం చేశాడు. విషయం ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించాడు.
ఎలాగోలా ఇంటి నుంచి తప్పించుకొని పారిపోయిన పనిమనిషి, తల్లికి విషయం చెప్పి ఆమె సహకారంతో 2006 జూన్లో బంజారాహిల్స్ పోలీసుకు ఫిర్యాదు చేసింది.
13 ఏళ్ల పాటు కేసును విచారించిన కోర్టు మంగళవారం తీర్పును వెలువరించింది. వహీద్ ఖాన్కు పది ఏళ్ల జైలుశిక్షతో పాటు 15 వేల రూపాయల జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించింది. అత్యాచారానికి సహకరించిన భార్యకు కోర్టు పది వేల రూపాయల జరిమానా విధించింది.