మంచు కుటుంబం గత కొన్నిరోజులుగా వార్తల్లో నిలుస్తున్నది. శ్రీ విద్యానికేతన్కు ప్రభుత్వం ఫీజు రియింబర్స్మెంట్ బకాయిలను చెల్లించటం లేదని మోహన్ బాబు టిడిపి ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. శుక్రవారం విద్యార్థులతో కలిసి ధర్నా కూడా చేశారు.
చంద్రబాబు నా మిత్రుడే అంటూ అయనపై మోహన్ బాబు విమర్శలు చేశారు. ప్రతిగా టిడిపి ఘాటుగానే స్పందించింది. మోహన్బాబు విద్య పేరుతో వ్యాపారం చేస్తున్నారనీ, వైసిపికి కొమ్ముకాస్తూ ఎన్నికల సమయంలో ప్రభుత్వంపై అసత్యాలను ప్రచారం చేస్తున్నారనీ టిడిపి నేత కుటుంబరావు ఆరోపించారు.
జగన్కు మోహన్ బాబు కుటుంబానికి బంధుత్వం ఉంది. కాబట్టి వైసిపికి మద్దతుగా టిడిపిని దెబ్బ కొట్టేందుకే మోహన్ బాబు ఇలా చేస్తున్నారా? అనే సందేహం వచ్చే అవకాశం లేకపోలేదు. కానీ మంచు మనోజ్ ట్వీట్స్ చూస్తే ఎవరికి మద్దతిస్తున్నారో తెలిసిపోతుంది.
కుటుంబరావు వ్యాఖ్యలకు కౌంటర్గా మంచు మనోజ్ శనివారం ట్విట్టర్ ద్వారా పలు ప్రశ్నలు సంధించారు. శ్రీ విద్యానికేతన్కు ప్రభుత్వం చెల్లించాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల లెక్కలను ప్రజల ముందు ఉంచారు. మనోజ్ ట్వీట్పై భిన్న అభిప్రయాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ సమయంలో ఒక ఆసక్తికర చర్చ ట్విట్టర్ వేదికగా జరిగింది. మీ మద్దతు జనసేన పార్టీకా, టిడిపికా అని ఒక నెటిజన్ ప్రశ్న అడగ్గా..’నా మద్దతు జనసేన పార్టీకే. అందులో మళ్ళీ సందేహం ఏమున్నది’ అని మనోజ్ తన అభిప్రాయాన్ని వ్యక్త పరిచారు.
దీనికి ఒక అభిమాని రిప్లై ఇస్తూ.. ‘అన్న చిన్న డౌట్, ఇప్పుడు ఏ పార్టీకి అయినా సపోర్ట్ చేయన్న, అది నీ ఇష్టం. కానీ, ఐదు లేదా పది సంవత్సరాల తరవాత తారక్ అన్న రాజకీయాల్లోకి వస్తే ఆయనకు తోడుగా ఉంటావా అన్న’ అని ప్రశ్నించాడు. దీనికి మనోజ్ స్పందించారు. ‘తారక్ వస్తే ఇక నేను ఎటు వెళ్తాను తమ్ముడు?! నా మిత్రుడి రాక కోసం ఎదురుచూస్తున్నాం. తారక్ ప్రాణానికి నా ప్రాణం అడ్డు’ అని మనోజ్ పేర్కొన్నారు. జూనియర్ ఎన్టీఆర్పై తనకున్న అభిమానాన్ని మరోసారి మనోజ్ చాటుకున్నారు.
మరోవైపు వైసిపికి కొమ్ముకాస్తున్నారని టిడిపి నేతలు విమర్శలు చేస్తున్న నేపథ్యంలో మనోజ్ జనసేనకే తన మద్దతు అని చెప్పటం కూడా ఆయన తెలివికి నిదర్శనమని అభిప్రాయం వ్యక్తమవుతున్నది.