హైదరాబాద్: తెలంగాణలో బలహీన వర్గాలపై జరుగుతున్న అత్యాచారాలకు నిరసనగా డిసెంబర్ 24వ తేదీన ఇందిరా పార్క్ వద్ద మౌన దీక్ష చేస్తున్నట్లు ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ తెలిపారు. దిశ నిందితుల ఎన్కౌంటర్ బూటకపు ఎన్కౌంటర్ అని ఆయన ఆరోపించారు. అగ్రకులాల మహిళలకు ఓ న్యాయం, పేద దళితులకు మరో న్యాయమా ? అని ప్రశ్నించారు. న్యాయ వ్యవస్థ కళ్లు కప్పే ప్రయత్నం ప్రభుత్వం చేస్తోందని మండిపడ్డారు. దిశ నిందితుల ఎన్కౌంటర్పై న్యాయ విచారణ జరగాలని డిమాండ్ చేశారు. రీపోస్టు మార్టం జరిగితే ప్రభుత్వ వైఫల్యం బయటపడుతుందని, అందుకే ప్రభుత్వం రీ పోస్టుమార్టం అంటే ఒప్పుకోవడం లేదని ఆరోపించారు. సుప్రీం వేసిన త్రిసభ్య కమిటీని స్వాగతిస్తున్నామని తెలిపారు. న్యాయవ్యవస్థ కళ్లు గప్పి చేసిన దారుణ హత్యలే నిందితుల ఎన్కౌంటర్ అని ఆయన దుయ్యబట్టారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలపై జరుగుతున్న అత్యాచారాలకు నిరసనగా ఇందిరా పార్క్ వద్ద జరిగే మౌన దీక్షను విజయవంతం చేయాలని మందకృష్ణ పిలుపునిచ్చారు.
previous post