తెలంగాణ గడ్డపై తిరుగులేని పార్టీగా టీఆర్ఎస్కు పేరు. ఇప్పుడీ పార్టీలో తొలిసారి వలసల భయం పట్టుకుంది. గులాబీ నేతల్లో కొందరు ప్రత్యామ్నాయ పార్టీ వైపు చూస్తున్నారట.
ఈ సంకేతాలతోనే…పార్టీ పెద్దలు సైతం అప్రమత్తమయ్యారని గులాబీ దళంలో టాక్ నడుస్తోంది.టీఆర్ఎస్ను వీడతారన్న నేతలను బుజ్జగించే పనిలో పడ్డారట పార్టీ అధ్యక్షుడు కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తెలంగాణ ఆవిర్భావం తర్వాత టీఆర్ఎస్ చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్కు విపక్ష పార్టీలు అప్పట్లో విలవిల్లాడాయి.
దుబ్బాక జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాల ఎఫెక్ట్!
దుబ్బాక ఉపఎన్నిక పోరుకు ముందు వరకు ఏకపక్షంగా కనిపించిన తెలంగాణ రాజకీయాల్లో మార్పులు సంభవిస్తున్నాయిప్పుడు. టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం తామేనంటున్న బీజేపీ.. ఆ దిశగా దూసుకుపోతుందని పలు పార్టీల నేతలు భావిస్తున్నారట. దుబ్బాక ఉప ఎన్నికలో విజయం సాధించి, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సత్తా చాటడంతో కమలనాథులు పార్టీని మరింత బలోపేతం చేసే పనిలో పడ్డారు. పలు పార్టీల నేతలకు గాలం వేస్తున్నారు. అధికార పార్టీ నుంచి కూడా రివర్స్ ఆపరేషన్ చేపట్టాలని కమలనాథులు చకచకా పావులు కదుపుతున్నారు.
సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న సీనియర్ నేతలు టీఆర్ఎస్లో ఉన్నారు. వారిలో కొందరికి పార్టీపై అసంతృప్తి ఉందట. ప్రస్తుతానికి టీఆర్ఎస్లోనే కొనసాగుతున్న ఆ అసంతృప్తు నేతలను తమ దారికి తెచ్చుకునేందుకు రాష్ట్ర, కేంద్ర బీజేపీ నేతలు వ్యూహరచన చేస్తున్నారు. ఉద్యమ సమయం నుంచి టీఆర్ఎస్కు అండగా ఉన్న శాసనమండలి మాజీ ఛైర్మన్ స్వామిగౌడ్…బీజేపీలో చేరిపోయారు
దీంతో..బీజేపీ ఇంకెవరిపై కన్నేసిందన్నదానిపై గులాబీదళంలోనూ విస్తృతంగా చర్చ జరుగుతోందని పొలిటికల్ సర్కిళ్లలో టాక్ నడుస్తోంది.
ఎవరెవరు పక్కచూపులు చూస్తున్నారు?
ఈ క్రమంలో కొందరి పేర్లు బయటపడుతున్నాయి. ముఖ్యంగా మాజీ మంత్రులపై బీజేపీ దృష్టిసారించిందట. ఈ కోవలో జూపల్లి కృష్ణారావు, తుమ్మల నాగేశ్వరరావు, కడియం శ్రీహరి, మహేందర్రెడ్డి ఉన్నారు. వీరంతా బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారన్న ప్రచారం రోజురోజుకు ఎక్కువైపోతుందని టాక్. గతంలో పలు పార్టీల నుంచి టీఆర్ఎస్లో చేరిన వారిలోనూ అసంతృప్తిని గమనిస్తున్నారు కమలనాథులు. ఇచ్చిన హామీ మేరకు ఇంతవరకు పదవులు దక్కని నేతల్లో పలువురు బీజేపీకి దగ్గరవుతున్నారన్న చర్చ అధికారపార్టీలో జరుగుతోంది. వారిని బుజ్జగించే పనిలో టీఆర్ఎస్ హైకమాండ్ నిమగ్నమైంది!