Kalyana Lakshmi Scam : ఆదిలాబాద్ జిల్లాలో కల్యాణలక్ష్మి డబ్బులు కాజేసేందుకు అక్రమార్కులు ఏకంగా ఎమ్మెల్యే సంతకాన్నే ఫోర్జరీ చేశారు. గ్రామ కార్యదర్శి నుంచి ఎమ్మెల్యే వరకు అందరి సంతకాలనూ ఇచ్చోడ మీసేవా కేంద్రంలోనే కాపీ కొట్టిసాక్షాత్తు అడ్డదారిలో రూ. కోట్లు మింగేశారు. ఈ కేసును ఉట్నూర్ డీఎస్పీ ఉదయ్రెడ్డికి అప్పజెప్పగా ఆయన దర్యాప్తులో విస్తుగొలిపే నిజాలు బయటకు వస్తున్నాయి. మరో రెండురోజుల్లో పై ఆఫీసర్లకు రిపోర్ట్ అందించనున్నట్లు తెలుస్తోంది.
హత్యతో వెలుగులోకొచ్చిన కుంభకోణం!
ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడలోని మీసేవా సెంటర్ కేంద్రంగా కల్యాణలక్ష్మిలో జరిగిన అక్రమాలపై పోలీసులు ఇన్వెస్టిగేషన్ ముమ్మరం చేశారు. రెండు నెలల క్రితం సిరికొండ మండలం పొన్నాకు చెందిన జ్ఞానేశ్వర్ హత్య తో ఈ విషయం వెలుగుచూసింది. ఈ కేసుకు సంబంధించి ఉట్నూర్ డీఎస్పీ ఉదయ్రెడ్డి దర్యాప్తులో వివిధ కొత్త కోణాలు వెలుగుచూస్తున్నాయి. ఆఫీసర్లు, మీసేవా నిర్వాహకులు కలిసి ఏకంగా 128 మంది పేర్లపై కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ స్కీముల కింద సొమ్ము స్వాహా చేసినట్లు తేలింది. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ స్కీంలే కాకుండా ఇచ్చోడ మీ సేవా సెంటర్ కేంద్రంగా అనేక అక్రమాలు జరిగినట్లు పోలీసుల తాజా దర్యాప్తులో బయటపడింది. వ్యవసాయ భూములు లేకున్నా ఉన్నట్లు సృష్టించడం, టైటిల్, పాస్ బుక్ల తయారీ, ఆఫీసర్లతో కుమ్మక్కై లోన్లు మంజూరు చేయించుకోవడం ఇక్కడ సర్వసాధారణమని తెలుస్తోంది. ఈ మొత్తం వ్యవహారంలో మీ సేవా సెంటర్ నిర్వాహకులతోపాటు వివిధ ఉద్యోగుల పాత్రపైనా రిపోర్ట్రెడీ చేసిన డీఎస్పీ ఉదయ్రెడ్డి ఒకటి రెండు రోజుల్లో పై ఆఫీసర్లకు నివేదించనున్నట్లు సమాచారం. దాని ప్రకారం బాధ్యులైన ఆఫీసర్లు, ఉద్యోగులపైనా చర్యలు ఉంటాయనే చర్చనడుస్తోంది.
డీఎస్పీ ఏం చెప్పారంటే?
మీ సేవా నిర్వాహకులు బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావ్ సంతకాన్ని ఫోర్జరీ చేసినట్లు తమ ఇన్వెస్టిగేషన్లో తేలిందని డీఎస్పీ ఉదయ్ తెలిపారు. ఎమ్మెల్యేతోపాటు ఆఫీసర్ల అటెస్టేషన్ను మీ సేవా సెంటర్లోనే చేశారని చెప్పారు.బోథ్ నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావ్కు తెలియకుండానే ఏడుగురికి కల్యాణలక్ష్మి సాంక్షన్ అయిందని, గతంలో ఎమ్మెల్యే చేసిన సంతకాన్ని స్కాన్ చేసి పెట్టుకున్న మీ సేవా నిర్వాహకులు కొత్త అప్లికేషన్లపై పేస్ట్ చేసి కథ నడిపించారని,ఆ తర్వాత ఫైల్ ను పద్ధతి ప్రకారం మూవ్చేసి డబ్బులు లేపేశారని ఆయన వివరించారు.ఒకరి హత్యకు ఈ కుంభకోణానికి కూడా సంబంధం ఉందని ఆయన పేర్కొన్నారు దర్యాప్తులో తేలిన అంశాలతో పై ఆఫీసర్లకు రిపోర్ట్ పంపిస్తామని డీఎస్పీ తెలిపారు.