MAOISTS ATTACKED: ఒడిశాలోని కందమాల్ జిల్లాలో పోలీసులకు మవోయిస్టులు షాక్ ఇచ్చారు. అటవీ ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నారనే సమాచారంతో కూబింగ్ కు వెళ్లిన పోలీసులపై మావోయిస్టులు మెరుపుదాడి చేశారు. అప్రమత్తమైన పోలీసులు ఎదురుకాల్పులు జరిపారు. ఈ ఎదురుకాల్పుల్లో మవోయిస్టులు ఎవరైనా గాయపడ్డారా అనేది ఇంకా తెలియరాలేదు. ఈ కాల్పుల్లో ఇద్దరు పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని వెంటనే భువనేశ్వర్ లోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం మవోయిస్టుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
ఈ ఘటనతో డీజీపీ అభయ్ తన మల్కన్ గిరి పర్యటన రద్దు చేసుకున్నారు. గాయపడిన కమాండోల పరిస్థితిని తెలుసుకునేందుకు డీజీపీ భూవనేశ్వర్ కు వెళ్లారు. తొలుత ఒక ఐఎఎఫ్ హెలికాఫ్టర్ కూడా పంపమని పోలీసులు కోరారు. అయితే వాతావరణం అనుకూలించకపోవడంతో అక్కడకు హెలికాఫ్టర్ చేరుకోలేకపోయింది. ప్రస్తుతానికి గాయపడిన కమాండోల పరిస్థితి స్థిరంగా ఉందని సమాచారం. ఇటీవల విశాఖ జిల్లాలో జరిగిన ఎదురుకాల్పుల్లో మావోయిస్టులు హతమైన సంగతి తెలిసిందే. దీనికి ప్రతీకారంగా పోలీసులపై మాటు వేసి మావోయిస్టులు కాల్పులు జరిపారని భావిస్తున్నారు.