కరోనా నేపథ్యంలో ప్రస్తుతం చాలా మంది ప్రజా రవాణా కాకుండా సొంత వాహనాల ద్వారానే బయటకు వెళ్తున్నారు. దీంతో ఇటీవలి కాలంలో వాహనాల కొనుగోళ్లు కూడా పెరిగాయి. కరోనా నేపథ్యంలో గత కొద్ది రోజుల కిందటి వరకు డల్గా ఉన్న ఆటోమొబైల్ మార్కెట్ మళ్లీ ఊపందుకుంది. అయితే సొంత వాహనాలను తీసుకునేవారి కోసం కార్ల తయారీదారు మారుతీ సుజుకీ సరికొత్త సర్వీస్ను తాజాగా అందుబాటులోకి తెచ్చింది. మారుతీ సుజుకీ సబ్స్క్రైబ్ సర్వీస్ పేరిట నూతన సర్వీస్ను ఆ కంపెనీ ప్రవేశపెట్టింది.
మారుతీ సుజుకీ సబ్స్క్రైబ్ సర్వీస్ ప్రస్తుతానికి కేవలం హైదరాబాద్, పూణెలలోనే అందుబాటులో ఉంది. త్వరలో ఇతర ప్రాంతాల్లోనూ ఈ సేవలను ఆ కంపెనీ అందివ్వనుంది. ఈ ప్రోగ్రామ్ ద్వారా ఎలాంటి డౌన్ పేమెంట్లను చెల్లించకుండానే వినియోగదారులు కార్లను పొందవచ్చు. కాకపోతే నెల నెలా సర్వీస్ చార్జి చెల్లించాలి. ఇక కార్పై వినియోగదారులు ఎలాంటి ఖర్చు చేయాల్సిన పనిలేదు. కార్ మెయింటెనెన్స్, ఇన్సూరెన్స్, 24 * 7 రోడ్ సైడ్ సపోర్ట్ తదితర సేవలన్నీ అందులోనే లభిస్తాయి. ఇక కార్లను తీసుకోవాలంటే వినియోగదారులు తమకు సమీపంలోని మారుతీ సుజుకీ షోరూంలో సంప్రదించవచ్చు.
వినియోగదారులు మారుతీ సుజుకీకి చెందిన స్విఫ్ట్, డిజైర్, విటారా బ్రెజ్జా, ఎర్టిగా, బలెనో, సియాజ్, ఎక్స్ఎల్ 6 తదితర కార్లలో దేన్నయినా సబ్స్క్రైబ్ సర్వీస్ కింద తీసుకోవచ్చు. 12, 18, 24, 30, 36, 42, 48 నెలల పాటు సబ్స్క్రైబ్ సర్వీస్ ప్లాన్లను ఎంచుకోవచ్చు. తరువాత నెల నెలా కారును బట్టి నిర్దిష్టమైన మొత్తాన్ని చెల్లించాలి. మారుతి సుజుకి స్విఫ్ట్ ఎల్ఎక్స్ఐ కారుకు సబ్స్క్రైబ్ సర్వీస్ రుసుం హైదరాబాద్లో నెలకు రూ.18,350 ఉండగా, పూణెలో రూ.17,600గా ఉంది. ఇలాగే ఇతర కార్లకు కూడా రుసుం ఉంటుంది. అయితే సబ్స్క్రైబ్ సర్వీస్ ముగిశాక కారును బై బ్యాక్ రూపంలో అమ్మేయవచ్చు.