(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
కదులుతున్న రైలులో ఎవరన్నా మర్దనా చేస్తే ఎంత బావుణ్ణు అని ఎప్పుడన్నా అనుకున్నారా. మీ కోరిక నెరవేరే రోజు వస్తోంది. భారత రైల్వే చరిత్రలో మొదటిసారిగా మర్దనా సేవలు ప్రవేశపెడుతున్నారు. మధ్యప్రదేశ్లోని ఇండోర్ నుంచి బయలుదేరే 39 రైళ్లలో ఈ సదుపాయం ప్రవేశపెట్టనున్నట్లు పిటిఐ వార్తా సంస్థ తెలిపింది.
పశ్చిమ రైల్వే జోన్లోని రత్లామ్ డివిజన్లో ఈ సదుపాయం ప్రవేశపెడుతున్నారు. దీనివల్ల ఆదాయం పెరగడమే కాక ప్రయాణీకులు కూడా ఎక్కువవుతారని రైల్వే అధికారులు అంటున్నారు. పాదం, శిరస్సు మర్దనా సేవలు ప్రవేశపెట్టనున్నారు. మర్దనాకు వంద రూపాయలు వసూలు చేస్తారు. ఛార్జీల ఆదాయం కాకుండా వేరే రకంగా రైల్వే శాఖకు అదాయం తీసుకొచ్చే మార్గాలు సూచించాల్సిందిగా ఆ శాఖ కోరింది. దీనికి సమాధానంగా వచ్చిన ఒక ప్రతిపాదన ఇది.