(విశాఖ నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి)
విశాఖలోని స్టీల్ ప్లాంట్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. టీపీపీ -2 టర్బన్ ఆయిల్ లీక్ అవ్వడంతో ఒక్క సారిగా మంటలు చెరరేగాయి అని చెబుతున్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ప్రమాదంలో 1.2 మెగావాట్ల విద్యుత్ మోటార్లు దగ్ధమైయ్యాయి. దాదాపు రెండు కోట్ల మేర ఆస్తినష్టం సంభవించినట్లు విశాఖ స్టీల్ ప్లాంట్ అధికారుల అంచనా.
విశాఖ స్టీల్ ప్లాంట్లో తరచు అగ్ని ప్రమాదాలు సంభవిస్తున్నాయి. ఈ ప్రమాదాల వల్ల కోట్లాది రూపాయల ఆస్తినష్టం జరుగుతోంది. గత ఏడాది జనవరి నెలలో వారం రోజుల వ్యవధిలోనే విశాఖ స్టీల్ ప్లాంట్లో రెండు ప్రమాదాలు జరిగాయి. స్టీల్ ప్లాంట్లోని బ్లాస్ట్ ఫర్నెస్ -3 లో ఒత్తిడి కారణంగా బ్లో పైపు పేలిపోయింది. ఆ ప్రమాదం కారణంగా భారీ అస్తినష్టం సంభవించింది. ఇది జరిగిన నాలుగు రోజుల్లోనే ప్లాంట్లోని ఎస్ఎంఎస్ వద్ద విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా పంప్ హౌస్ అగ్నికి ఆహుతి అయ్యింది. ఈ ఏడాది ఏప్రిల్ 30వ తేదీన స్టీల్ ప్లాంట్ ఎస్ఎంఎస్ డిపార్ట్మెంట్ లో లాడిల్ తెగిపోవడంతో ఉక్కు ద్రవం నేలపాలైంది. ఆ ప్రమాదంలోనూ కోటి రూపాయల వరకూ నష్టం వాటిల్లింది.