లక్నో : ట్రిపుల్ తలాక్ బిల్లు చట్టంగా మారిన తరువాత దీని కింద ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మథురలో మొదటి కేసు నమోదు అయ్యింది.
ట్రిపుల్ తలాక్-2019 బిల్లుకు ఉభయ సభల్లో ఆమోదం లభించిన తరువాత బిల్లుకు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆమోదించి నోటిఫికేషన్ విడుదల చేయడంతో అమలులోకి వచ్చింది.
వరకట్నం ఇవ్వడం లేదని ఒక వ్యక్తి భార్యకు ట్రిపుల్ తలాక్ చెప్పాడు. కోసి ప్రాంతానికి చెందిన జిమిరాత్, మేవత్కు చెందిన ఇక్రమ్కు కొద్ది నెలల క్రితం వివాహమైంది. కట్నం విషయంలో ఇరు కుటుంబాల మధ్య వివాదం మొదలైంది. ఈ నేపథ్యంలో గురువారం పెద్ద మనుషుల సమక్షంలో పంచాయతీ నిర్వహించారు. వరకట్నం కింద లక్ష రూపాయలు చెల్లిస్తేనే జుమిరాత్ను ఏలుకుంటానని ఇక్రమ్ తెగేసి చెప్పాడు.
అత్తింటి వారు డబ్బులు ఇచ్చేందుకు అంగీకరించకపోవడంతో నడిరోడ్డుపైనే మూడుసార్లు తలాక్ చెప్పి భార్యతో తనకు ఏ సంబంధం లేందటూ అక్కడ నుంచి వెళ్లిపోయాడు. దీనిపై బాధితురాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ముస్లిం మహిళల వివాహ హక్కుల పరిరక్షణ చట్టం -2019 ప్రకారం ఇక్రమ్పై కేసు నమోదు చేశామని మథుర ఎస్పి షాలాబ్ మాథుర్ చెప్పారు. ఈ చట్టం ప్రకారం తక్షణ ట్రిపుల్ తలాక్ క్రిమినల్ చర్యగా పరిగణిస్తారు. నేరం నిరూపణ అయితే నిందితునికి మూడేళ్ల జైలు శిక్ష విధిస్తారు.