మేయర్ గద్వాల విజయలక్ష్మి అధ్యక్షతన జరుగుతున్న జీహెచ్ఎంసీ ప్రత్యేక బడ్జెట్ సమావేశంలో తీవ్ర గందరగోళ పరిస్థితి నెలకొంది. బీజేపీ సభ్యులు మేయర్ పోడియాన్ని చుట్టుముట్టి సమస్యలపై డిమాండ్ చేశారు. నగరంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని, కాంట్రాక్ట్ పెండింగ్ బిల్లులను చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో బిజేపీ సభ్యులను మేయర్ వారించే ప్రయత్నం చేసినా ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన తెలియజేస్తూనే ఉన్నారు. సభ్యులు ఆందోళన మధ్యలోనే రూ.6,624 కోట్ల అంచనాలతో 2013 – 2024 వార్షిక బడ్జెట్ కు జీహెచ్ఎంసీ ఆమోదం తెలిపింది.
సభ్యుల ఆందోళన మధ్యలోనే బడ్జెట్ కు ఆమోదం తెలిపినట్లుగా మేయర్ విజయలక్ష్మి ప్రకటించారు. బడ్జెట్ పై ఎలాంటి చర్చ లేకుండానే ఆమోదించడంపై విపక్ష సభ్యులు ఆందోళన చేపట్టారు. ఈ తరుణంలో బీజేపీ, టీఆర్ఎస్ సభ్యుల పోటాపోటీ నినాదాలు చేయడంతో గందరగోళ పరిస్థితి నెలకొంది. మేయర్ డౌన్ డౌన్ అంటూ బీజేపీ కార్పోరేటర్ లు నినాదాలు చేశారు. కార్పోరేషన్ లో ఎమ్మెల్యే ల పెత్తనం ఎక్కువైందని పలువురు సభ్యులు ఆరోపిస్తూ ఆందోళన చేశారు. ఈ నేపథ్యంలో బీజేపీ కార్పోరేటర్ల తీరుపై మేయర్ విజయలక్ష్మి తీవ్రంగా మండిపడ్డారు. మహిళా మేయర్ కు ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ విజయలక్ష్మి సీరియస్ అయ్యారు. పోడియం వద్ద నుండి సభ్యులు వెళ్లి వారి వారి స్థానాల్లో కూర్చోవాలి మేయర్ సూచించారు. సభ్యుల ఆందోళనతో సభను వాయిదా వేశారు.