MEB Trailer: టాలీవుడ్ సినీ ప్రేక్షకులు ఎంతో కాలంగా వేచి చూస్తున్న “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్” థియేట్రికల్ ట్రైలర్ తాజాగా విడుదలైంది. ఈ చిత్రంతో డైరెక్టర్ బొమ్మరిల్లు భాస్కర్ కంబ్యాక్ ఇవ్వబోతున్నారు. ఈ రొమాంటిక్ కామెడీ డ్రామాలో అక్కినేని అఖిల్ సరసన పూజా హెగ్డే నటించింది. ఈ చిత్రం ఎప్పుడో విడుదల కావాల్సి ఉంది కానీ కరోనాతో వాయిదా పడుతూ ఎట్టకేలకు దసరా సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యింది. తాజాగా విడుదలైన ట్రైలర్ తో ఈ సినిమా కథ ఏంటి అనేది చాలా వరకు అర్థమవుతోంది. దర్శకుడు భాస్కర్ రొమాంటిక్, కామెడీ ఎలిమెంట్స్ తో సహా ఇందులో మ్యారేజ్ అనే ఎలిమెంట్ యాడ్ చేశారు. ఈ ట్రైలర్ కట్ లో కామెడీ, రొమాంటిక్ సన్నివేశాలు సరిసమానంగా చూపించి ఆసక్తిని పెంచేశారు మేకర్స్.
ఈ ట్రైలర్ రివ్యూ చూస్తే.. స్టాండ్ అప్ కమెడియన్ విభా (పూజా హెగ్డే) తనకు ఎంతో ప్రాధాన్యత ఇస్తూ తనతోనే సమయం గడిపే పర్ఫెక్ట్ పార్ట్నర్ ని పెళ్లి చేసుకోవాలని అనుకుంటుంది. ఈ ట్రైలర్ లో అఖిల్ లైఫ్ లో బాగా సెటిలైన ఎన్ఆర్ఐగా కనిపించాడు. తాను పూజా ఆలోచనలకి భిన్నంగా మాంచి రొమాంటిక్, మోడర్న్ భార్య దొరికితే చాలని కోరుకుంటాడు. పెళ్లి చూపులకు వెళ్ళిన ప్రతిసారీ అమ్మాయిలను బోల్డ్ క్వశ్చన్స్ అడుగుతూ తన క్యారెక్టర్ ఏంటో రివీల్ చేస్తాడు. తర్వాత పూజా హెగ్డే, అఖిల్ ఒకరికి ఒకరు ప్రేమించుకొని చెట్టాపట్టాలేసుకొని తిరుగుతారు. వీరు ప్రపంచాన్ని మరచి రొమాన్స్ లో మునిగితేలుతున్నప్పుడు మురళీ శర్మ చూస్తాడు. ఈ విషయాన్ని పూజా హెగ్డే కుటుంబ సభ్యులకి తెలియజేస్తాడు. దాంతో పూజా హెగ్డే కుటుంబ సభ్యులు అఖిల్ పై రౌడీలతో దాడి చేయిస్తారు. అలాగే అఖిల్ క్యారెక్టర్ గురించి పూజా హెగ్డే కుటుంబ సభ్యులకు కూడా తెలిసినట్లు ఈ ట్రైలర్ ను చూస్తుంటే తెలుస్తోంది.
అతని క్యారెక్టర్ బ్యాడ్ అని.. పూజా హెగ్డే ముందు నిరూపించడానికి కోర్టును ఆశ్రయించినట్లు కూడా ఇందులో కనిపించింది. జాతి రత్నాలు ఫేమ్ ఫరియా అబ్దుల్లా ఈ చిత్రంలో కూడా కోర్టు సీన్ లో కనిపిస్తుంది. కోర్టు బోనులో నిల్చొని.. అఖిల్ వ్యక్తిత్వం చాలా చెడ్డదని ఆమె చెబుతూ కనిపిస్తుంది. ఈ కోర్టు సన్నివేశం తర్వాత పూజా హెగ్డే అఖిల్ తో కాస్త దూరంగా ఉంటుందని.. దాంతో ఆమెను అతడు కన్విన్స్ చేయడానికి ప్రయత్నిస్తాడని తెలుస్తోంది. అది సాధ్యపడక అతను తన జీవితంలో సర్దుకుపోయినట్టు.. బ్యాచిలర్ గానే మిగిలి పోయినట్లు ట్రైలర్ ఎండింగ్ లో ఒక హింట్ దొరికింది. మరి పూజా హెగ్డే, అఖిల్ క్యారెక్టర్స్ పెళ్లి చేసుకుంటారో లేదో తెలియాలంటే.. బ్రేకప్ స్టోరీ ఉంటుందో తెలుసుకోవాలంటే సినిమా విడుదలయ్యే అంతవరకు వేచి చూడాల్సిందే.
ఈ ట్రైలర్ చూస్తుంటే ఈ సినిమాలో కొత్తగా చూపించింది ఏమీ లేదు అనిపిస్తుంది. పాటలు, రొటీన్ ఫైట్లు, కామెడీ రొమాన్స్ సీన్స్ అన్నీ ఎలిమెంట్స్ ఉన్నాయి. కానీ ఎక్కడో కొత్తదనం మిస్ అయినట్లు అనిపిస్తుంది. ప్రొడక్షన్ వాల్యూస్ మాత్రం చాలా బాగున్నాయి. గోపీసుందర్ మ్యూజిక్ కూడా ఈ సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ అవుతుంది. ఈ సినిమాలో ఆమని, మురళీ శర్మ, ఈషా రెబ్బా, వెన్నెల కిషోర్, జయప్రకాష్, కీలక పాత్రలు పోషిస్తున్నారు. జబర్దస్త్ శీను కూడా ఇందులో కనిపించాడు. మరి అక్టోబర్ 15న వస్తున్న ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుంటుందో చూడాలి!