కరోనా మహమ్మారి కారణంగా అన్ని రంగాల మాదిరిగానే సినీ పరిశ్రమ కూడా తీవ్రంగా దెబ్బతిన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సినీ పరిశ్రమ పునరుజ్జీవం కోసం ఏపి ప్రభుత్వం రీస్టార్ట్ ప్యాకేజీ ప్రకటించింది. సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి అధ్యక్షతన శుక్రవారం జరిగిన కేబినెట్ సమావేశంలో సినీ పరిశ్రమ ఊరట కల్పించే నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. మల్టీ ప్లేక్సె లు సహా అన్ని ధియేటర్ లకు మూడు నెలల పాటు కరెంటు చార్జీలను రద్దు చేయడంతో పాటు మరో ఆరు నెలల చార్జీల చెల్లింపులను వాయిదా వేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకున్నది.
ఈ నిర్ణయంతో రాష్ట్ర వ్యాప్తంగా 1100 థియేటర్లకు లబ్ది చేకూరుతుంది. అదే విధంగా రిస్టార్ట్ ప్యాకేజీ కింద ధియేటర్ లకు రూ.5లక్షల నుండి రూ.10లక్షల వరకూ వర్కింగ్ క్యాపిటల్ రుణాలు, వాయిదాల చెల్లింపుపై మారటోరియం ప్రకటించిన విషయం తెలిసిందే. దీని వల్ల రాష్ట్ర ప్రభుత్వంపై రూ.4.18 కోట్ల భారం పడనున్నది.
ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. జగన్ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల సినీ పరిశ్రమలోని ధియేటర్లతో పాటు మరెంతో మంది కార్మికులకు జీవనోపాధి కలగడంతో పాటు వేలాది కుటుంబాలు లబ్దిపొందుతాయని చిరంజీవి పేర్కొన్నారు. జగన్మోహనరెడ్డి సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయాలపై దిల్ రాజుతో సహా పలువులు సినీ రంగ ప్రముఖులు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.