Chiranjeevi: తెలుగు సినీ పరిశ్రమలో చిరంజీవి ప్రస్థానం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్. టి రామారావు తర్వాత ఆ రేంజ్ లో ఆరాధించబడిన ఏకైక స్టార్ హీరో మెగాస్టార్. అయితే సినిమాల్లో తనకు పునరాగమనం తర్వాత చిరంజీవి కథల ఎంపిక విషయంలో బాగా తడబడ్డాడు అనే చెప్పాలి.
‘ఖైదీ నెంబర్ 150’ చిత్రం తర్వాత ‘సైరా’ చేసిన చిరంజీవి వరుసగా నాలుగు చిత్రాలకు సంతకం చేశారు. వాటిల్లో కొరటాల శివతో చేస్తున్న ‘ఆచార్య’ ఒక్కటే కొద్దిగా మెగా అభిమానులకు ఆశలు రేపుతున చిత్రం. మిగిలిన మూడు చిత్రాలు స్టార్ డైరెక్టర్లతో కాకపోవడం పెద్ద సమస్య. అందులో రెండు రీమేక్ చిత్రాలు.
మెహర్ రమేష్ దర్శకత్వంలో తమిళంలో విడుదలై మంచి హిట్ సాధించిన వేదలం రీమేక్ భోళా శంకర్ గా చేస్తున్న చిరంజీవి మోహన్ రాజా దర్శకత్వంలో మలయాళ చిత్రం లుసిఫర్ రీమేక్ గాడ్ ఫాదర్ చిత్రాన్ని చేస్తున్నాడు.
ఇక చిరు బాబీ దర్శకత్వంలో చేస్తున్న వాల్తేర్ వీరయ్య చిత్రానికి కోన వెంకట్ రచయిత. ఈ చిత్రంలో సన్నివేశాలు తెరకెక్కించే విధానం పై చిరంజీవి అసంతృప్తిగా ఉన్నట్లు కూడా కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. కోన వెంకట్ అవుట్ డేటెడ్ సీన్లకు బాబీ ఓకే అంటున్నట్లు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.
అది కాకుండా ఆచార్య మినహాయించి మిగిలిన మూడు సినిమాలు కూడా పాన్ ఇండియా స్థాయిలో విడుదలయ్యే కథలు అయితే కాదు. ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోలతో పాటు ఒక రేంజ్ కథానాయకులు కూడా పాన్ ఇండియా చిత్రాలు తీసేస్తున్నారు. అయితే చిరంజీవి మాత్రం ఇలా తన మూడు సినిమాలు తెలుగు వరకే పరిమితం చేయడం కొద్దిగా మెగా అభిమానులకు రుచించడం లేదు. తొందర పడకుండా సమయం తీసుకొని మెగాస్టార్ మంచి ప్రాజెక్టులు ప్లాన్ చేసుకొని ఉంటే బాగుండేదని అంటున్నారు.