(హైదరాబాద్ నుండి “న్యూస్ ఆర్బిట్” బ్యూరో)
కరోనా పట్ల ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండండి, అశ్రద్ద వహించవద్దు మాస్కు తప్పనిసరిగా ధరించండి, భౌతిక దూరం పాటించండి అంటూ మెగాస్టార్ చిరంజీవి ప్రజలకు సామాజిక మాధ్యమాల ద్వారా సందేశం ఇస్తున్న విషయం తెలిసిందే. అయితే చాలా జాగ్రత్తలు పాటిస్తున్న చిరుకు కూడా నేడు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది.
ఆచార్య షూటింగ్ ప్రారంభోత్సవం కోసం చిరు కరోనా పరీక్ష చేయించుకోగా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. ఈ విషయంపై చిరు స్వయంగా ప్రకటన విడుదల చేశారు. “ నాకు ఎలాంటి లక్షణాలు లేవు, వెంటనే హోం క్వారంటైన్ అయ్యాను, గత నాలుగైదు రోజులుగా నన్ను కలిసిన వారందరూ టెస్ట్లు చేయించుకోవాలి” అని చిరు సూచించారు. ఎప్పటికప్పుడు తన ఆరోగ్య పరిస్థితిని తెలియజేస్తానని చిరు పేర్కొన్నారు.
కాగా.. మూడు రోజుల క్రితం చిరు.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్తో భేటీ అయ్యారు. సీఎం కెసిఆర్ను అక్కినేని నాగార్జున, చిరంజీవి కలిసి సీఎం సహాయ నిధికి గానూ వరద సాయం చెక్కులను అందజేశారు. నేడు చిరుకు కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయిన నేపథ్యంలో సీఎం కెసిఆర్, సినీ నటుడు నాగ్ తదితర ప్రముఖులు అందరూ కోవిడ్ టెస్ట్లు చేయించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
సినీ రంగంలో ఇప్పటికే అమితాబ్, రాజమౌళి, తమన్నా, ఎస్పి బాలసుబ్రమణ్యం తదితర ప్రముఖులు కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. ఎస్పీ బాలసుబ్రమణ్యంకు కరోనా తగ్గినా ఇతర ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో ఆయన కన్నుమూశారు. ఇతరులు అందరూ కరోనా నుండి కొద్ది రోజుల్లోనే కొలుకున్నారు. చిరు కుటుంబంలోనూ నాగబాబు దంపతులు కరోనా బారిన పడి కోలుకున్నారు. నేడు తాజాగా చిరుకు కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడం మెగా అభిమానులు ఆందోళన చెందుతున్నారు. కరోనా నుండి చిరు త్వరగా కోలుకోవాలంటూ భగవంతుడిని ప్రార్థిస్తున్నారు.
ఆచార్య షూటింగ్ ప్రారంభించాలని,కోవిడ్ టెస్ట్ చేయించుకున్నాను. రిజల్ట్ పాజిటివ్. నాకు ఎలాంటి కోవిడ్ లక్షణాలు లేవు.వెంటనే హోమ్ క్వారంటైన్ అయ్యాను.గత 4-5 రోజులుగా నన్ను కలిసినవారందరిని టెస్ట్ చేయించుకోవాలిసిందిగా కోరుతున్నాను.ఎప్పటికప్పుడు నా ఆరోగ్య పరిస్థితిని మీకు తెలియచేస్తాను. pic.twitter.com/qtU9eCIEwp
— Chiranjeevi Konidela (@KChiruTweets) November 9, 2020