మెగాస్టార్ చిరంజీవి మెహర్ రమేష్ తో సినిమా చేస్తున్నాడు అనగానే మెగా ఫ్యాన్స్ అందరూ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఎందుకంటే మెహర్ రమేష్ ట్రాక్ రికార్డ్ అటువంటిది. శక్తి, కంత్రి, షాడో వంటి దారుణమైన సినిమాలను అందించాడు మెహర్ రమేష్. గత ఏడేళ్ల నుండి మెహర్ రమేష్ సినిమాను తెరకెక్కించింది లేదు. దర్శకత్వానికి దూరంగా ఉన్నాడు. పైగా వరసగా డిజాస్టర్లు.
ఇలాంటి ట్రాక్ రికార్డ్ ఉన్న దర్శకుడ్ని నమ్మి చిరంజీవి సినిమా అప్పగించాడు. మెహర్ రమేష్ కు తమిళంలో సూపర్ హిట్ అయిన వేదాళం సినిమా రీమేక్ బాధ్యతలను అప్పగించాడు. నెమ్మదిగా ఈ నిజాన్ని జీర్ణించుకుంటున్నారు మెగా ఫ్యాన్స్.
అయితే ఈ సినిమాకు సంబంధించిన వార్తలు వచ్చినవి చూసి కొంచెం ధైర్యం వచ్చింది. ఎందుకంటే మెహర్ రమేష్ ఈ రీమేక్ కోసం దాదాపు 3 ఏళ్ళు శ్రమించాడు. అలాగే ఈ సినిమాకు లిమిటెడ్ బడ్జెట్ అనుకుని దాంట్లోనే సినిమాను పూర్తి చేయాలనుకుంటున్నారు. కచ్చితంగా ఈ సినిమా కమర్షియల్ గా ఫెయిల్ అవ్వకూడదు అన్న ఉద్దేశం చిరంజీవి అండ్ టీమ్ లో బలంగా కనిపిస్తోంది. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర ఈ సినిమాను నిర్మించనున్నాడు. చిరంజీవి ప్రస్తుతం ఆచార్య సినిమాను చేస్తున్న విషయం తెల్సిందే. అక్టోబర్ నుండి ఈ సినిమా షూటింగ్ మొదలవుతుంది. చిరంజీవి దసరా తర్వాత షూట్ లో పాల్గొంటాడు. ఆచార్య వచ్చే ఏడాది మార్చ్ లో పూర్తవుతుంది. ఏప్రిల్ ఆఖరు వారంలో విడుదల చేయాలని కొరటాల శివ ప్లాన్ చేసుకున్నాడు.
ఆచార్య పూర్తైన కొద్ది రోజులకే ఎక్కువ ఆలస్యం లేకుండా వేదాళం సినిమాను మొదలుపెట్టనున్నాడు. ఈ సినిమా షూటింగ్ మేలో మొదలై దసరాకు విడుదల చేయాలని భావిస్తున్నారు. అసలైతే ఈ దసరాకు ఆచార్యను విడుదల చేయాలనుకున్నారు. అది కుదర్లేదు. కనీసం వచ్చే ఏడాదికి వేదాళం రీమేక్ తో సక్సెస్ ను కొట్టాలనుకుంటున్నాడు చిరంజీవి. చూడాలి మరి అది ఎంతవరకూ వర్కౌట్ అవుతుందో.