ఢిల్లీ, జనవరి 14: ఇండియా గేట్ దగ్గర‘ పాకిస్తాన్ జిందాబాద్ ’అంటూ నినాదాలు చేసిన ఓ మహిళను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అక్కడ
గణ తంత్రదినోత్సవ రిహార్సల్స్ జరుగుతున్నాయి. ఆ సమయంలో ఓ మహిళ అమర్ జ్యోతి జవాన్ ప్రాంతానికి వెళ్లడానికి ప్రయత్నించింది. ఆ సమయంలో అక్కడ ఉన్న భద్రతా సిబ్బంది ఆమెను ఆపేందుకు ప్రయత్నించారు. కానీ ఆమె వారిని తోసేసి ముందుకు వెళ్లి ‘పాకిస్తాన్ జిందాబాద్’ అంటూ నినాదాలు చేయడం ప్రారంభించింది. ఆమెను అడ్డుకోబోయిన సిబ్బందిని నెట్టివేయడానికి ప్రయత్నించింది. ఆ స్త్రీని అదుపులోకి తీసుకుని పార్లమెంట్ స్ట్రీట్లోని పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారు.
అనంతరం సదరు మహిళ గురించి విచారణ చేయగా ఆమె పేరు సుల్తానాగా, స్వస్ధలం నిజామాబాద్ గా గుర్తించారు. ముంబైలో ఉంటున్న బంధువులను కలుసుకునేందుకు ఆమె ఇంట్లో చెప్పకుండా వచ్చిందని పోలీసుల విచారణలో తెలిసింది. కానీ అనుకోకుండా ఢిల్లీలో ఆగిపోవాల్సి వచ్చిందని పోలీసులు చెప్పారు.
ఆమె కనిపించకుండా పోవడంతో కుటుంబ సభ్యులు నిజామాబాద్లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఢిల్లీ పోలీసులు ఈ విషయం గురించి హైదరాబాద్ అధికారులను అడిగి తెలుసుకోవడంతో
మహిళకు సంబంధించిన వివరాలు వెలుగులోకి వచ్చాయి. అనంతరం సదరు మహిళకు వైద్య పరీక్షలు నిర్వహించగా ఆమె మానసిక స్థితి సరిగా లేదని గుర్తించడంతో ఆ మహిళను షెల్టర్ హోంలో చేర్పించారు.