చైనా దుందుడుకు చర్య వల్ల ఇరవైమంది భారత జవాన్లు అమరులయ్యారనే విషయం తెలియడంతో తైవాన్ – హాంగ్ కాంగ్ నెటిజన్లు కూడా సోషల్ మీడియా వేదికగా సంఘీభావం తెలిపారు. డ్రాగన్ తీరుపై భారత్ లో ఆగ్రహావేశాలు పెల్లుబికాయి.
సోషల్ మీడియా వేదిక ఫేస్ బుక్ – వాట్సాప్ తో పాటు వివిధ మార్గాల్లో భారతీయులు తమ సంఘీభావాన్ని తెలిపారు.అయితే హాంగ్ కాంగ్ సోషల్ మీడియా వేదిక LIHKGలో హిందువుల ఆరాధ్య దైవం శ్రీరాముడు తన విల్లును చైనా డ్రాగన్ పైకి ఎక్కుపెట్టినట్లుగా ఉన్న ఓ ఇన్ ఫోగ్రాఫిక్ ఫోటోను సంఘీభావంగా పోస్ట్ చేశారు. దీనిని హాంగ్ కాంగ్ ట్విట్టర్ యూజర్ హోసేయ్ లీ అనే నెటిజన్ షేర్ చేశాడు.
ఇది వెంటనే వైరల్ గా మారింది. దేశ సరిహద్దులు దాటి విస్తరణకు అర్రులు చాస్తున్న చైనాకు వ్యతిరేకంగా పోస్టులు పెట్టిన ఇండియన్ నెటిజన్లకు హాంగ్ కాంగ్ జనాలు కూడా తోడయ్యారు. హాంగ్ కాంగ్ ట్విట్టర్ యూజర్లు భారత్ కు తమ మద్దతు తెలుపుతూ #HKstandswithIndia (హాంగ్ కాంగ్ స్టాండ్ విత్ ఇండియా) హ్యాష్ ట్యాగ్ ను ట్రెండ్ చేశారు
ఈ అద్భుత ఫోటోని తైవాన్ మీడియా ఆర్గనైజేషన్ కూడా ప్రశంసించింది. తైవాన్ లోని ప్రముఖ ఇంగ్లీష్ మీడియా ఆర్గనైజేషన్ ది తైవాన్ న్యూస్ డ్రాగన్ పైకి విల్లు ఎక్కుపెట్టిన రాముడి చిత్రరూపం హాంగ్ కాంగ్ – తైవాన్ – ఇండియాలను ఏకం చేసిన దృష్టాంతం గురించి – చైనా సరిహద్దుదాహం గురించి రాసింది. హాంగ్ కాంగ్ – తైవాన్ లకు చైనాపై ఆగ్రహం ఉంది.
శత్రువుకు శత్రువు మిత్రుడు అన్నట్లు ఆయా దేశాలుగా వ్యవహరిస్తున్నాయని అంతర్జాతీయ విశ్లేషకులు చెబుతున్నారు.