మొదటి మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ఓడిపోయిన ముంబై ఇండియన్స్ తన తప్పుల నుండి పాఠాలు నేర్చుకుంది. తన రెండో మ్యాచ్ కోల్కతా నైట్ రైడర్స్ తో జరిగిన విషయం తెల్సిందే. అబు దాబిలో జరిగిన ఈ మ్యాచ్ హోరాహోరీగా ఉంటుందని అందరూ ఊహించారు. కానీ ముంబై ఇండియన్స్ కనీసం పోటీకి కూడా ఆస్కారం ఇవ్వలేదు.
పూర్తి ఏకపక్షంగా సాగిన మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ 49 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. తద్వారా పాయింట్ల పట్టికలో మొదటి స్థానానికి చేరుకుంది. మళ్ళీ టాస్ ఓడిపోయిన ముంబై మొదట బ్యాటింగ్ చేయాల్సి వచ్చింది. డి కాక్ వికెట్ ను చాలా త్వరగానే కోల్పోయింది ముంబై ఇండియన్స్. అయితే రోహిత్ శర్మ మొదటి మ్యాచ్ లో త్వరగానే ఔటైనా ఈ మ్యాచ్ లో బాధ్యతతో ఆడాడు. హిట్ మ్యాన్ కు సూర్య కుమార్ యాదవ్ నుండి మంచి సహకారం లభించింది.
దీనికి తోడు కోల్కతా బౌలింగ్ నాసిరకంగా ఉండడం కూడా కలిసొచ్చింది. పదే పదే రోహిత్ శర్మకు షార్ట్ బాల్స్ వేశారు. దానికి అవలీలగా బౌండరీ అవతలకు పంపించాడు రోహిత్ శర్మ. మొత్తంగా 20 ఓవర్లు ముగిసే సరికి ముంబై 20 ఓవర్లకు 195 పరుగులు చేసింది. ఇదేమి అసాధ్యమైన టోటల్ అయితే కాదు. అయినా కోల్కతా మొదటి నుండి ఇంటెంట్ తో ఆడింది లేదు. పైగా టాప్ ఆర్డర్ ను మార్చడం కోల్కతాకు అంతగా కలిసొచ్చింది లేదు.
ముంబై పేస్ దళం బుమ్రా, బౌల్ట్, ప్యాటిన్సన్ అద్భుతంగా బౌలింగ్ చేసారు. వీరికి పోలార్డ్, రాహుల్ చాహర్ సహకారం మరువలేనిది. ఫలితంగా కోల్కతా ఏ దశలోనూ ఛేదనలో లేదు. చివర్లో ప్యాట్ కమిన్స్ మెరుపులు లేకపోతే కేకేఆర్ 146 పరుగులు కూడా చేయలేక చతికిలపడేది. ఎన్నో అంచనాలు పెట్టుకున్న మోర్గాన్, రస్సెల్ నిరుత్సాహపరిచారు. 80 పరుగులు చేసిన రోహిత్ శర్మ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు.