Satya Nadella: టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ బోర్డులో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ప్రస్తుత సీఈఓ గా ఉన్న తెలుగుతేజం సత్య నాదేళ్ల ను బోర్డు చైర్మన్ ఎన్నుకున్నారు. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఈ మేరకు ఏకగ్రీవంగా నాదేళ్ల పేరుకు ఆమోదం తెలిపారు. ప్రస్తుత చైర్మన్ గా ఉన్న జాన్ థామ్సన్ స్వతంత్ర డైరెక్టర్ గా నియమించింది. ఇంతకు ముందు కూడా థామ్సన్ 2012 నుండి 2014 వరకూ ఈ పదవిలో కొనసాగారు. కాగా సత్య నాదేళ్ల 2014 నుండి మైక్రో సాఫ్ట్ సీఈఓ గా కొనసాగుతున్న విషయం తెలిసిందే. స్టీవ్ బాల్మెర్ స్థానంలో నాదేళ్ల ఈ పదవిలో ఎంపికైయ్యారు. సీఈఓ గా బాధ్యతలు చేపట్టిన తరువాత నాదేళ్ల మైక్రో సాఫ్ట్ ప్రాజెక్టు అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు. న్యూయాన్స్ కమ్యూనికేషన్స్, లింక్డ్ ఇన్, జెనిమాక్స్ లాంటి బిలియన్ డాలర్ల కొనుగోళ్లతో పాటు అనేక లావాదేవీలతో మైక్రో సాఫ్ట్ వృద్ధిలో నాదేళ్ల కీలకంగా వ్యవహరించారు. ప్రధానంగా క్లౌడ్ కంప్యూటింగ్ పై సంస్థ విస్తృతంగా పని చేయడంతో మొబైల్ రంగంపై పట్టు సాధించింది.
నాదేళ్ల చైర్మన్ గా ఎన్నిక కావడంతో బోర్డు అజెండాను నిర్ణయించే అధికారం సంక్రమించనున్నది. వ్యూహాత్మక అవకాశాలను దక్కించుకునేందుకు, కీలక ఇబ్బందులను గుర్తించేందుకు నాదేళ్లకు వ్యాపారంపై ఉన్న అవగాహన బాగా ఉపయోగపడుతుందని మైక్రో సాఫ్ట్ ఓ ప్రకటనలో పేర్కొంది.
సత్య నాదేళ్ల అసలు పేరు సత్యనారాయణ నాదేళ్ల. అనంతపురం జిల్లా ఎల్లనూరు మండలం బుక్కపురం గ్రామానికి చెందిన 1962 బ్యాచ్ కి చెందిన ఐఏఎస్ అధికారి నాదేళ్ల యుగందర్ కుమారుడు సత్య నాదేళ్ల. రాష్ట్రంలో మంచి అధికారిగా పేరు తెచ్చుకున్న యుగందర్ 2004 నుండి 2009 వరకూ ప్రధాని నేతృత్వంలోని కేంద్ర ప్రణాళికా సంఘం సభ్యుడిగా, ప్రధాన మంత్రి కార్యదర్శిగా పని చేశారు. యుగందర్ ఐఏఎస్ కు ఎంపికైన తరువాత హైదరాబాదులో స్థిరపడ్డారు.
1967లో యుగందర్ దంపతులకు హైదరాబాద్ లో సత్య నాదేళ్ల జన్మించారు. ఆయన ప్రాధమిక విద్యాభ్యాసం అంతా హైదరాబాద్ లోనే సాగింది. 1988లో ఇసీఈలో బీఈ పూర్తి చేసిన సత్య నాదేళ్ల అమెరికాలోని విస్కాన్సిస్ యూనివర్శిటీ నుండి కంప్యూటర్ సైన్స్ లో మాస్టర్ డిగ్రీ, చికాగో యూనివర్శిటీ నుండి బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ లోనూ మాస్టర్ డిగ్రీ చేశారు. అనంతరం సాఫ్ట్ వేర్ రంగంలో పలు హోదాల్లో పని చేశారు. అమెరికా పౌరసత్వం తీసుకుని అక్కడే స్థిరపడ్డారు. 1992లో మైక్రోసాఫ్ట్ లోకి అడుగుపెట్టారు. వ్యాపార సేవల విభాగంలో కీలక భూమికను పోషించి అయిదేళ్లలో కంపెనీ వ్యాపారాన్ని రూ.9వేల కోట్ల నుండి రూ.31వేల కోట్లకు తీసుకువెళ్లారు. ఆల్ రౌండర్ గా పేరుగాంచిన సత్య నాదేళ్ల మైక్రోసాఫ్ట్ లో అంచలంచెలుగా ఎదిగి చైర్మన్ స్థాయికి చేరుకున్నారు.