ఇప్పుడంటే చాలా మంది గూగుల్ క్రోమ్, ఫైర్ఫాక్స్ తదితర ఇంటర్నెట్ బ్రౌజర్లను ఉపయోగిస్తున్నారు. కానీ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ కొత్తగా వచ్చినప్పుడు మైక్రోసాఫ్ట్ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్నే ఎక్కువగా ఉపయోగించేవారు. అయితే రాను రాను ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ అంటే నెటిజన్లకు అయిష్టత ఏర్పడింది. గూగుల్ క్రోమ్, ఫైర్ ఫాక్స్ బ్రౌజర్ల తరహాలో ఫీచర్లు లభించకపోవడంతో జనాలు ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ను వాడేందుకు విముఖత వ్యక్తం చేశారు. దీంతో అప్పటి నుంచే ఆ బ్రౌజర్ పతనం ప్రారంభమైంది. అయితే మైక్రోసాఫ్ట్ సంస్థ ఇక శాశ్వతంగా ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ సేవలను నిలిపివేయనున్నట్లు ప్రకటించింది.
త్వరలో ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ సేవలను నిలిపివేస్తామని సాఫ్ట్వేర్ సంస్థ మైక్రోసాఫ్ట్ ప్రకటించింది. దీంతో ఆ బ్రౌజర్కు ఇక సపోర్ట్ కూడా లభించదు. 2021 ఆగస్టు 17 నుంచి ఆఫీస్ 365, వన్ డ్రైవ్, ఔట్లుక్ తదితర యాప్స్కు ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ పనిచేయదని, అందువల్ల ఆ బ్రౌజర్కు సపోర్ట్ను నిలిపివేయనున్నామని ఆ సంస్థ తెలియజేసింది. ఇక ఈ ఏడాది నవంబర్ 30 నుంచి ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్కు పనిచేసే సిబ్బందిని కూడా ఆ పనుల నుంచి మైక్రోసాఫ్ట్ ఇతర పనులకు మార్చనుంది. అందువల్ల ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ ఇకపై నెటిజన్లకు అందుబాటులో ఉండదు.
అలాగే మైక్రోసాఫ్ట్కు చెందిన ఎడ్జ్ లెగసీ డెస్క్టాప్ యాప్కు కూడా 2021 మార్చి 9 నుంచి సపోర్ట్ను నిలిపివేయనున్నట్లు ఆ సంస్థ తెలియజేసింది. అయితే ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్కు ఘనమైన చరిత్రే ఉంది. ఒకప్పుడు.. జనాలు ఆ బ్రౌజర్నే ఎక్కువగా వాడేవారు. జనాలకు ఆ బ్రౌజర్ ఇంటర్నెట్ను దగ్గర చేసింది. కానీ ఇకపై ఆ బ్రౌజర్ అందుబాటులో ఉండకపోవడం విచారకరం. ఇతర బ్రౌజర్లు ఇస్తున్న పోటీకి తట్టుకోలేకే ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ సేవలను నిలిపివేస్తున్నట్లు అర్థమవుతుంది. అయితే దానికి బదులుగా ఇప్పటికే మైక్రోసాఫ్ట్ సంస్థ ఎడ్జ్ బ్రౌజర్ను అందుబాటులో ఉంచింది.