ఒంగోలు: ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం అమలుపై పిల్లలు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు.
వచ్చే ఏడాది నుండి ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటి నుండి ఆరు తరగతుల వరకూ పూర్తిగా తెలుగు మాధ్యమాన్ని ఎత్తివేసి ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెడుతున్న తరుణంలో తెలుగు భాషాభిమానులు, పలు వర్గాల నుండి వ్యతిరేకత వ్యక్తం అవుతున్నది.
ఒంగోలులో క్యాంప్ కార్యాలయాన్ని మంత్రి సురేష్ ఆదివారం ప్రారంభించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఒకే సారి ఆంగ్ల భాషను పిల్లలపై రుద్దకుండా దశలవారీగా ప్రక్రియ చేపడతామని తెలిపారు. ఆంగ్ల మాధ్యమం ద్వారా పేద, మద్య తరగతి విద్యార్థులకు విద్యనందించడం వల్ల ఎంతో మేలు జరగనుందని ఆయన చెప్పారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి విద్యాభివృద్ధికి పెద్ద పీట వేస్తున్నారనీ, ప్రభుత్వ బడ్జెట్లో విద్య కోసం 16 శాతం నిధులు కేటాయించారనీ సురేష్ గుర్తు చేశారు.