అమరావతి: ప్రాజెక్టులపై గత ప్రభుత్వం అంచనాలు పెంచుకుంటూ పోయిందని జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ విమర్శించారు. ఏపి శాసనసభ బడ్జెట్ సమావేశంలో ప్రశ్నోత్తరాల సమయంలో సాగునీటి ప్రాజెక్టులపై జరిగిన చర్చలో మంత్రి అనిల్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయాలని సిఎం వైఎస్ జగన్మోహనరెడ్డి కష్టపడుతున్నారనీ అన్నారు. పోలవరం ప్రాజెక్టుకు అనుమతులు ఎవరి హయాంలో వచ్చాయో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసునని అనిల్ కుమార్ అన్నారు. కేంద్రం నుండి అనుమతులు తీసుకురావడం దగ్గర నుండి కాలువ పనుల వరకూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలోనే జరిగాయని అనిల్ కుమార్ గుర్తు చేశారు.
పోలవరం ప్రాజెక్టు కోసం వైఎస్ఆర్ తవ్వించిన కాలువలకే రెండు లిఫ్ట్లు పెట్టి టిడిపి నేతలు 400కోట్ల రూపాయలు దోచేశారనీ అనిల్కుమార్ ఆరోపించారు. ప్రాజెక్టులపై కమిటీలు వేశామనీ, త్వరలోనే నివేదికలు వస్తాయని అనిల్ కుమార్ అన్నారు. కమిటీ నివేదికలు వచ్చాక అన్ని విషయాలు బయటకు వస్తాయని అనిల్ కుమార్ పేర్కొన్నారు. నివేదిక ఆధారంగా రివర్స్ టెండరింగ్పై నిర్ణయం తీసుకుంటామని అనిల్ కుమార్ అన్నారు. పోలవరం ప్రాజెక్టును సిఎం జగన్ పూర్తి చేస్తారని అనిల్ కుమార్ చెప్పారు. వైఎస్ఆర్ హయాంలోని ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తామనీ మంత్రి అనిల్ కుమార్ ప్రకటించారు.