పోలవరం ప్రాజెక్టును వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి పూర్తి చేస్తామని నీటి పారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. ఏపి అసెంబ్లీలో బుధవారం పోలవరం ప్రాజెక్టుపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా టీడీపీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడిపై మంత్రి అనిల్ విమర్శల వర్షం కురిపించారు. చంద్రబాబు హయాంలో ఒక్కటంటే ఒక్కటి శంకుస్థాపన నుండి ప్రారంభోత్సవం చేసిన ప్రాజెక్టు ఉందా అని ప్రశ్నించారు. ఏదన్నా అంటే పట్టిసీమ పేరు చెబుతారు. పట్టిసీమ లిఫ్ట్ కు కాలువల నిర్మాణం రాజశేఖరరెడ్డి హయాంలోనే పూర్తి అయిన విషయాన్ని అనిల్ కుమార్ గుర్తు చేశారు. పోలవరం ప్రాజెక్టుకు దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి 2004లో శంకుస్థాపన చేయగా 2005లో పనులు ప్రారంభం అయ్యాయని మంత్రి అనిల్ తెలిపారు. పోలవరం ప్రాజెక్టుకు అన్ని అనుమతులు వైఎస్ హయాంలోనే వచ్చాయనీ అన్నారు. చంద్రబాబు పోలవరం ప్రాజెక్టును నిర్లక్ష్యం చేశారని విమర్శించారు.
అయిదు పీపిఏ మీటింగ్ల్లో కూడా కొత్త అంచనాలను ఇవ్వాలని కోరినా టీడీపీ ప్రభుత్వం ఇవ్వకుండా కాలయాపన చేస్తూ వచ్చిందనీ, ప్రత్యేక ప్యాకేజీ కోసం 2014 అంచనాలకే ఒప్పుకున్నారని అన్నారు. కేంద్ర ప్రభుత్వమే నిర్మించాల్సిన ప్రాజెక్టును ప్యాకేజీల కోసం రాష్ట్రమే నిర్మిస్తుందని చంద్రబాబు పోలవరం నిర్మాణ బాధ్యతలు తీసుకున్నారని మంత్రి అనిల్ కుమార్ పేర్కొన్నారు. నాడు ప్రతిపక్ష నేతగా ఉన్న నేటి సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి ఈ అంశాన్ని ప్రశ్నించారని గుర్తు చేశారు. గత అయిదేళ్లలో ప్రాజెక్టు మొత్తంలో 20శాతం పనులు కూడా చేయలేదని అన్నారు. ప్రధాన మంత్రికి రాసిన లేఖలో కూడా చంద్రబాబు అవాస్తవాలు రాసారని అన్నారు. పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు ఏటీఎంలా వాడుకున్నారని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీనే స్వయంగా అన్నారని గుర్తు చేశారు. 18వేల కుటుంబాలు నిరాశ్రయులు అవుతున్నా చంద్రబాబు పట్టించుకోలేదన్నారు. ప్రాజెక్టు మొత్తంలో 20శాతం పనులు కూడా పూర్తి చేయకుండా 70శాతం పూర్తి చేశామంటూ గొప్పలు చెప్పుకుంటున్నారనీ, గత ప్రభుత్వ హయాంలో జరిగిన పనులను కూడా తమ ఖాతాలో వేసుకుని టీడీపీ వారు చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు.
ఎట్టిపరిస్థితుల్లోనూ డిసెంబర్ 2021 నాటికి పోలవరం పూర్తి చేస్తామని మంత్రి ప్రకటిస్తూ ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి టీడీపీ ఎమ్మెల్యేలను కూడా ఆహ్వానిస్తామని అన్నారు. పోలవరం ఎత్తు తగ్గిస్తున్నామంటూ దుష్ర్పచారం చేస్తున్నారని మండిపడుతూ ప్రాజెక్టు ఎత్తు ఒక్క మిల్లీ మీటరు కూడా తగ్గించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు మంత్రి అనిల్ కుమార్. పోలవరం ప్రాజెక్టు విషయంలో చంద్రబాబు చేసిన తప్పులను సరిచేసుకూంటూ ముందుకు వెళతామన్నారు. ఇప్పటికే ప్రాజెక్టు విషయంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ లేఖ రాసిన విషయాన్ని తెలియజేస్తూ పీపీఏ అథారిటీలో కూడా సవరించిన అంచనాలపై తమ వాదనలు వినిపించామని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తెలిపారు.
ప్రభుత్వ తీరు వల్లనే పోలవరంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నారని ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు అన్నారు. పోలవరం ప్రాజెక్టుకు తన హయాంలో టెండర్లు పిలవలేదన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాతే పనులు మొదలు అయ్యాయని అన్నారు. పోలవరం టెండర్లను వైఎస్ ప్రీక్లోజర్ చేశారనీ, ఆ తరువాత కిరణ్ కుమార్ రెడ్డి వచ్చే వరకూ ఫైనల్ చేయలేదన్నారు. ఏడు ముంపు మండలాలను తీసుకురాకపోయి ఉంటే ప్రాజెక్టు అసలు ప్రాజెక్టు ఉండేది కాదని అన్నారు చంద్రబాబు. వైసీపీ ప్రభుత్వం పోలవరాన్ని కావాలనే వివాదంలోకి నెడుతోందని విమర్శించారు. “మీకు తీసుకున్న గోతిలో మీరే పడే పరిస్థితి వచ్చింది” అని చంద్రాబు అన్నారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?