కడప: రాయలసీమలో హైకోర్టు అంశం పరిశీలనలో ఉందని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి అన్నారు. అబివృద్ధి వికేంద్రీకరణ చాలా అవసరమని ఆయన అన్నారు. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో సమాన అభివృద్ధి చేయాలని నిర్ణయించామని బుగ్గన తెలిపారు.
కర్నూల్లో హైకోర్టు ఏర్పాటు చేయాలని కోరుతూ అక్కడి న్యాయవాదులు రిలే దీక్షలు నిర్వహిస్తున్నారు. అక్కడి న్యాయవాదుల ఆందోళనకు అధికార పార్టీ ప్రజాప్రతినిధులు సంఘీభావం తెలియజేస్తున్నారు. ఇటీవల బిజెపి రాజ్యసభ సభ్యుడు జివిఎల్ నర్శింహరావుకు కూడా న్యాయవాదుల దీక్షకు సంఘీభావం తెలియజేస్తూ కర్నూల్లో హైకోర్టు ఏర్పాటు చేయాలని మొదటి నుండి డిమాండ్ చేస్తున్నది బిజెపియేనని తెలిపారు. శ్రీభాగ్ ఒప్పందం ప్రకారం కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని ఆ ప్రాంత రాజ్యసభ సభ్యుడు టిజి వెంకటేష్ కూడా డిమాండ్ చేస్తున్నారు. మరో పక్క ఉత్తరాంధ్ర న్యాయవాదులు వైజాగ్లో హైకోర్టు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తుండగా, రాజధాని అమరావతి ప్రాంతం నుండి హైకోర్టు తరలించడానికి వీలులేదని ఇక్కడి న్యాయవాదులు ఆందోళన చేస్తున్నారు.
మూడు ప్రాంతాల నుండి హైకోర్టు విషయంపై ఆందోళనలు జరుగుతున్న నేపథ్యంలో ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ హైకోర్టుపై ప్రకటన చేయడం ప్రాధాన్యతను సంతరించుకున్నది.