మాట ఇచ్చిన మంత్రిగారు ముఖం చాటేశారు!సమస్యను పరిష్కరిస్తామని చెప్పిన అధికారులు కాలయాపన చేసి ఎవరినీ నొప్పించకుండా ఉండే రీతిలో ఒక నిర్ణయం తీసుకుని పక్కకు తప్పుకున్నారు.అయితే అధికారులు తీసుకున్న ఈ నిర్ణయమే ఆ సమస్యను మరింత జఠిలం చేసేదిగా ఉంది.
వివరాల్లోకి వెళితే చీరాల తీరప్రాంతంలో వాడరేవు కటారిపాలెం గ్రామాల మత్స్యకారుల మధ్య వలల వాడకంపై గొడవలు మొదలై అవి ముదిరి ఘర్షణకు దారి తీయటం తెలిసిందే.ఓడరేవు మత్స్యకారులు వాడుతున్న బల్లవల వివాదానికి మూలకారణం.ఆ రకం వలను వాడడంవల్ల మత్స్యసంపద అంతరించిపోతోందన్నది కటారి పాలెం వాసుల అభ్యంతరం.కటారి పాలెం మత్స్యకారులు ఐలవలలు వాడుతుంటారు. దీన్ని వాడరేవు మత్స్యకారులు వ్యతిరేకిస్తున్నారు.ఈ విషయమై చాలా కాలంగా గొడవ జరుగుతోంది.
అధికారులు సరైన సమయంలో ఈ సమస్యను పరిష్కరించ లేకపోవడం వల్ల ఘర్షణలు జరిగి దాదాపు ఇరవై మంది వరకు గాయపడ్డారు.వెనువెంటనే స్పందించిన మత్స్యశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు తాను స్వయంగా వాడరేవుకు వెళ్లి ఈ సమస్యను పరిష్కరిస్తానని సుమారు పదిహేను రోజుల క్రితం ఒక టీవీ చానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు.కానీ ఈ రోజుకీ ఆయన రాలేదు. ఆయన కోసం వేచి చూసి మత్స్యకారుల కళ్లు వాచిపోయాయి.గొడవ జరిగి ఇరవై రోజులవుతుండగా సమస్యను నానబెడుతూ వచ్చిన ప్రకాశం జిల్లా మత్స్యశాఖ అధికారులు రెండు రకం వలలను నిషేధిస్తూ మంగళవారం కీలక నిర్ణయం తీసుకున్నారు.బల్లవల, ఐలవలలపై తదుపరి ఆదేశాలు ఇచ్చేంత వరకు నిషేధం కొనసాగుతుందన్నారు.
ఈ నిషేధం తక్షణం అమల్లోకి వస్తుందన్నారు. ఐలవల, బల్లవలలపై ఇండియన్ ఫిషరీయాక్ట్ 145 సెక్షన్ ప్రకారంనిర్ణయం తీసుకున్నామని.. ఆదేశాలను ధిక్కరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేశారు.కాగా రెండు వలల నిషేధం సమస్యకు పరిష్కారం కాదని మత్స్యకారులు చెప్తున్నారు.అధికారుల వైఖరి తాంబూలాలిచ్చాం తన్నుకు చావండి అన్నట్టుగా ఉందని వారు వాపోతున్నారు.ఇప్పటికే ఇరవై రోజులుగా వేటకు పోకుండా ఉపాధికోల్పోయిన మత్స్యకారులు అధికారుల తాజా నిర్ణయంతో పూర్తిగా నష్టపోయే పరిస్థితి తలెత్తబోతోంది.ఇచ్చిన మాట ప్రకారం మంత్రి వచ్చి ఈ సమస్యలు పరిష్కరించాలని మత్స్యకారులు కోరుతున్నారు.