ఏపీ ముఖ్యమంత్రి , వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై విపక్షాలు చేసే విమర్శలకు కౌంటర్ ఇచ్చే విషయంలో ఏపీ మంత్రి కొడాలి నాని ముందుంటారనే సంగతి తెలిసిందే. పరుషమైన పదాలకు ఆయన పెట్టింది పేరు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుపై అయితే ఒంటి కాలిపై విరుచుకుపడుతుంటారు.
తాజాగా మరోమారు మంత్రి కొడాలి నాని తన ఉగ్రరూపం ప్రదర్శించారు. అమరావతి ఉద్యమం 365 రోజులు పూర్తైన సందర్భంగా చంద్రబాబు, ఆయన తోకపార్టీలు మీటింగ్ పెట్టాయని ఎద్దేవా చేశారు. అంతేకాకుండా చంద్రబాబు రాజకీయాల్లో ఉండాలని నాని ఆకాంక్షించారు.
రాజకీయాలు వదిలేస్తానంటున్న నాని
చంద్రబాబుకు మతిభ్రమించి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారని బీసీ సదస్సులో సీఎం జగన్ చెప్పిన అరగంటలోనే చంద్రబాబు శాపనార్థాలు పెట్టడానికే వచ్చినట్లు ఇష్టమొచ్చినట్లు వాగారని కొడాలి నాని మండిపడ్డారు. “ అమరావతి సభలో అమరావతిని ఎలా కాపాడాలి. అమరావతిలో రైతులకు ఏవిధమైన న్యాయం చేయాలి? అమరావతిని రాజధానిగా ఉండాలంటే ఏం చేయాలి. ప్రభుత్వానికి సలహాలు ఇస్తారేమో అని చూశాను. కానీ అదేమీ జరగలేదు `అని కొడాలి నాని అన్నారు. “టీడీపీది జాతీయ పార్టీగా ఎన్నికల సంఘం ఏమైనా సర్టిఫై చేసిందా? టీడీపీది ఒక ఉప ప్రాంతీయ పార్టీ. నువ్వు ఒక జాతీయ నాయకుడివా? టీడీపీ జాతీయ పార్టీ అని నిరూపిస్తే రాజకీయాల్లోంచి వెళ్లిపోతా“ అని కొడాలి నాని సవాల్ చేశారు.
టీడీపీ ఓ ఫేక్ పార్టీ
టీడీపీ ఒక ఫేక్ పార్టీ…చంద్రబాబు ఒక ఫేక్ అధ్యక్షుడు అని కొడాలి నాని విరుచుకుపడ్డారు. “ అమరావతి శంకుస్థాపన ప్రదేశానికి వెళ్లి బాబు పడుకున్నారు. 1983లో కాంగ్రెస్ పార్టీ టిక్కెట్తో పోటీ చేసి ఓడిపోయి ఎన్టీఆర్ కాళ్ల దగ్గర కూడా ఇలాగే (శంకుస్థాపన దగ్గర సాష్టాంగపడిన ఫొటోను చూపిస్తూ) చంద్రబాబు పడుకున్నారు. అమరావతి రైతుల్ని కూడా ఫేక్ అమరావతిని పేపర్ మీద సృష్టించి చంద్రబాబు మోసం చేశారు. అమరావతి అంటూ ఫేక్ గ్రాఫిక్స్ రిలీజ్ చేసి 33 వేల ఎకరాలు దోచుకొని రైతుల్ని మోసం చేశారు. రాజధాని ముందే వస్తుందని తెల్సి చంద్రబాబు, కొన్ని వ్యవస్థల్లోని అధిపతులతో కోట్లాను కోట్ల డబ్బులు మిగులుతాయని పెట్టుబడులు పెట్టించి రైతుల్ని నిట్టనిలువునా దోపిడీ చేశారు. ఐదేళ్లు ఫేక్ గ్రాఫిక్స్ రిలీజ్ చేసి రైతులను రోడ్ల మీద పడేసిన గుంట నక్క చంద్రబాబు“ అని కొడాలి నాని అన్నారు.
బాబు రాజకీయాలు వదిలిపెట్టొద్దు…
సీఎం జగన్ మట్టి కొట్టుకుపోతారని చంద్రబాబు అనటంపై కొడాలి నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. “జగన్ మోహన్ రెడ్డి పార్టీ పెట్టి ప్రజల దగ్గరకు వెళ్లి ఐదేళ్లు పోరాటాలు చేసి 67 మంది శాసనసభ్యులతో ప్రతిపక్ష నాయకుడయ్యారు. ఆతర్వాత పాదయాత్రతో సీఎం అయ్యారు. సీఎం అయిన తర్వాత ఇచ్చిన ప్రతిమాట నెరవేరుస్తున్నారు. ఈరోజున చంద్రబాబు నోటికి అడ్డుఅదుపూ లేకుండా సీఎం జగన్ పై పడి ఏడ్వటం ఏంటి?“ అని ప్రశ్నించారు. గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఓటేయమని ట్విట్టర్లో కోరాడు. గ్రేటర్ ఎన్నికల్లో అభ్యర్థులను పెట్టి బాబు, కొడుకులు ఇంట్లో పడుకోవటం ఏంటి? ఫేక్ పార్టీ తరుపున గ్రేటర్లో 1.29% ఓటింగ్ వచ్చింది. హైదరాబాద్ ప్రజలు అండర్ గ్రౌండ్లో పెట్టారు. ఇలాంటి నాయకత్వం ఉన్న చంద్రబాబు ఉంటేనే వచ్చే ఎన్నికల్లో జగన్ కు 170 సీట్లు. అందుకే , చంద్రబాబు ఎట్టి పరిస్థితుల్లోనూ రాజకీయాల నుంచి వెళ్ళకూడదు.. “ అని కొడాలి నాని అన్నారు.