అమరావతి: పోలీసు, రెవిన్యూ, రవాణా, మీడియా తదితర అన్ని వ్యవస్థలలో కూడా అవినీతిపరులు ఉన్నారనీ, అంతమాత్రాన వ్యవస్థ మొత్తానికి అవినీతిని ఆపాదించడం సరి కాదని రవాణా శాఖ మంత్రి పేర్ని నాని అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తప్పులు చేయని సమాజం నేడు ఎక్కడైనా ఉందా అని పేర్ని ప్రశ్నించారు.
విద్యాసంవత్సరం కాగానే స్పెషల్ డ్రైవ్లు నిర్వహించి అర్హత లేని బస్సులు సీజ్ చేశామని పేర్ని అన్నారు. ఏపిలో ఆదాయం తెచ్చే శాఖల్లో రవాణా శాఖ నాలుగో స్థానంలో ఉందని పేర్ని పేర్కొన్నారు. ప్రతి రాజకీయ పార్టీ గతంలో స్కూల్ బస్సులు వాడుకునే వారనీ, అటువంటి వారిపై చర్యలు తీసుకోవాలంటే అధికారులు మొహమాట పడేవారని పేర్ని అన్నారు.
గతంతో పోలిస్తే ఆటో ప్రమాదాల సంఖ్య కొంత వరకు తగ్గాయని పేర్ని తెలిపారు. ద్విచక్ర వాహనాల ప్రమాదాలు, మరణాల సంఖ్య బాగా పెరిగిందని పేర్ని పేర్కొన్నారు. ద్విచక్ర వాహన చోదకులు రోడ్ల మీద ఇష్టం వచ్చినట్లు తోలుతూ, ఇతరులకు కూడా ఇబ్బంది కల్గిస్తున్నారని పేర్ని అన్నారు. వాహన చోదకుల్లో అవగాహన పెంచకుండా అధికారులు ఎన్ని చర్యలు చేపట్టినా ప్రమాదాల సంఖ్య తగ్గించలేమనీ పేర్ని స్పష్టం చేశారు.పాఠశాలలు, కళాశాలలో ప్రమాదాల నివారణపై విద్యార్థులకు అవగాహన కల్పించాలని పేర్ని అన్నారు.
ప్రమోషన్లు, ట్రాన్సఫర్లు పూర్తి పారదర్శకంగా నిర్వహిస్తామనీ,అన్ని అర్హతలు ఉండి అన్యాయం జరిగితే నేరుగా తనను కలవవచ్చని పేర్ని తెలిపారు. రవాణా శాఖ అధికారులు లక్ష్యాలను చేరుకోవడానికి చిన్న వాళ్ల కన్నా పెద్ద వాళ్లను పట్టుకోవాలని పేర్ని సూచించారు. ఇసుక, మట్టి అక్రమ రవాణా పై ప్రత్యేక దృష్టి పెట్టాలని పేర్ని ఆదేశించారు. నేడు దీన్ని పెద్ద వ్యాపారంగా మార్చుకుని కొంత మంది దోచుకుంటున్నారని పేర్ని తెలిపారు. డ్రంక్ అండ్ డ్రైవ్ స్పెషల్ డ్రైవ్లను జాతీయ రహదారిపై విస్తృతం చేయాలని పేర్ని సూచించారు. తనిఖీల్లో ఆర్టిసి, ప్రైవేటు బస్సులు, లారీ డ్రైవర్లు ఎవరినీ వదలనక్కర్లేదని పేర్ని స్పష్టం చేశారు. హైటెక్ బస్సులలో అక్రమాలను కూడా అరికట్టాలని పేర్ని ఆదేశించారు.