రాజకీయాల్లో ఆరోపణలు, ప్రత్యారోపణలు సహజం. అయితే, కొన్ని సందర్భాల్లో ఇవి సవాళ్ల స్థాయికి చేరుతాయి. కొందరి రాజకీయ జీవితాలను ప్రభావితం చేస్తుంటాయి.
ఆంధ్రప్రదేశ్లో ఒకదాని వెంట ఒకటి అన్నట్లుగా దేవాలయాల్లో జరుగుతున్న పలు ఘటనలు అనేకమందిలో ఆందోళనను కలిగిస్తున్నాయి. ఈ సమయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తర్వాత ఆ స్థాయిలో టార్గెట్ అవుతోంది దేవాదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు. ఆయనపై తెలుగుదేశం పార్టీ విరుచుకుపడుతోంది. అయితే, తనపై వస్తున్న విమర్శలకు తాజాగా వెల్లంపల్లి ఘాటు స్పందించారు.
జగన్ కోసం ఈ నిర్ణయం…
తాడేపల్లిలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడిన వెల్లంపల్లి దేవాలయాల్లో వరుస ఘటనల్లో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కుట్ర ఉంది అని ఆరోపించారు. ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే వ్యక్తి, ఈ రాష్ట్రానికి సుధీర్ఘ కాలం ముఖ్యమంత్రిగా, ప్రతిపక్షనాయకుడిగా ఉన్నానని చెప్సుకుంటూ దిగజారుడు రాజకీయాలు చేస్తున్న వ్యక్తి చంద్రబాబునాయుడు అని మంత్రి వెల్లంపల్లి మండిపడ్డారు. సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై, ఈ ప్రభుత్వంపై లేనిపోని ఆరోపణలు చేస్తూ ప్రజల్లో అపోహలు, అనుమానాలు సృష్టించే విధంగా ప్రయత్నించేందుకు చాలా కుట్రలు పన్నుతున్నారు అంటూ విరుచుకుపడ్డారు. వైఎస్ఆర్సీపీ హయాంలో ఏ ఒక్క దేవాలయం కూల్చలేదని, ఏదీ ఉద్దేశపూర్వకంగా జరిగింది కాదని ప్రమాణం చేస్తాను మీ హయాంలో ఒక్క ఆలయం కూడా కూల్చలేదని కాణిపాకం వినాయకుడి మీద ప్రమాణం చేయగలరా బాబూ అంటూ మంత్రి వెల్లంపల్లి సవాల్ విసిరారు. ఈ సవాల్ ను స్వీకరించకపోతే.. చంద్రబాబు ఎప్పటికీ హిందూ ద్రోహిగానే మిగులుతాడని వ్యాఖ్యానించారు.
మోదీకి దగ్గరయ్యేందుకు బాబు గేమ్
దేవాలయాలపై ఘటనల వెనుక ప్రభుత్వం ఉందని ప్రజల్లో అనుమానాలు రేకెత్తించే విధంగా చంద్రబాబునాయుడు మాట్లాడడం చాలా భాదాకరమని వెల్లంపల్లి అన్నారు. గత ఐదేళ్ళలో చంద్రబాబు దేవాలయాలను ఏ విధంగా కూల్చేశాడు, గోశాలలను ఏ విధంగా కూల్చేశాడు… పుష్కరాల పేరుతో ప్రజల నిధులు ఎలా కొట్టేశారు… ఇవన్నీ దాచేస్తే దాగవు. విజయవాడలో పురాతనమైన దేవాలయాలను కూల్చడమే కాకుండా… దేవుడి విగ్రహాలను కార్పొరేషన్ చెత్త తరలించే వాహనాల్లో తీసుకెళ్ళి పడేసిన దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు అంటూ మంత్రి వెల్లంపల్లి మండిపడ్డారు. “గత ఎన్నికల ముందు నరేంద్రమోదీ గారు అధికారంలోకి రారు అని ఆయనపై చంద్రబాబు అవాకులు చెవాకులు మాట్లాడిన ఇప్పుడు మరోసారి ప్రధాని అయ్యేసరికి ఏదో విధంగా ఆయన కాళ్ళు పట్టుకునైనా ఏదో విధంగా ఆయనకు చేరువ అవ్వాలని ఏపీలో హిందూ దేవాలయాలు, హిందువుల మనోభావాలు దెబ్బతింటున్నాయి.. అంటూ చంద్రబాబు వ్యాఖ్యానిస్తున్నారు` అని మంత్రి వెల్లంపల్లి మండిపడ్డారు.
మీ జమానాలో ఏం జరిగింది బాబు?
చంద్రబాబు హడావిడిగా ప్రెస్మీట్ పెట్టి ఈ ప్రభుత్వం మీద నిందలు మోపుతున్నారని వెల్లంపల్లి ఆరోపించారు. “టీడీపీ హయాంలోనే సాక్షాత్తూ ట్రస్ట్బోర్డు మెంబర్ పట్టుచీరల దొంగతనం చేశారు. అదే విధంగా చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడే అమ్మవారి బంగారు కిరీటం, ముక్కుపుడక దొంగలింపబడటం అందరికీ తెలుసు. అదే విధంగా దుర్గగుడిలో తాంత్రిక పూజలు జరగలేదా..? తన హయాంలో జరిగినవన్నీ.. ఇప్పుడు జరుగుతున్నాయంటూ మాట్లాడుతుంటే.. చంద్రబాబుకు మతిమరుపు ఎక్కువైంది ఏమో అనిపిస్తుంది. ఈ రోజు రథం విషయంలో మంత్రిని బర్తరఫ్ చేయాలంటున్నారు. ఎంత చౌకబారు, దిగజారుడు రాజకీయాలు చంద్రబాబు చేస్తున్నారు.. ఆ రోజు తన హయాంలో జరిగిన ఘటనలకు చంద్రబాబు రాజీనామా చేసి ఉంటే.. ఈరోజు మంత్రిని బర్తరఫ్ చేయాలని అడిగే నైతిక హక్కు ఉండేది. చంద్రబాబు చేసిన ఆరోపణలకు నేను సమాధానం చెప్పడానికి సిద్దంగా ఉన్నా, నేను చెప్పే వాస్తవాలకు మీ చిత్తూరు జిల్లాలోని కాణిపాకం వినాయకుడి వద్ద ప్రమాణం చేసి చెప్పగలవా?“ అంటూ వెల్లంపల్లి సవాల్ విసిరారు.