ఇటీవల జరిగిన ఆదిభట్ల మహిళా వైద్యురాలు వైశాలి కిడ్నాప్ కేసు తీవ్ర సంచలనం అయిన సంగతి తెలిసిందే. నవీన్ రెడ్డి అనే యువకుడు వందల మంది యువకులతో వైద్యురాలి ఇంటిపై దాడి చేసి సినీ పక్కీలో కిడ్నాప్ చేయడం జరిగింది. ఆ కేసులో నవీన్ రెడ్డితో సహా అతనికి సహకరించిన 40 మందికిపైగా యువకులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన మరువక ముందే తెలంగాణలో అదే తరహా కిడ్నాప్ జరగడం కలకలాన్ని రేపింది.
వివరాల్లోకి వెళితే … రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం మూడవల్లి గ్రామానికి గోలి శాలిని అనే యువతి తన తండ్రితో కలిసి మంగళవారం వేకువజామున గ్రామంలో హనుమాన్ ఆలయంలో పూజ చేయడానికి బయలుదేరింది. ఆ యువతిని కిడ్నాప్ చేసేందుకు ఆలయం వద్ద అప్పటికే కొందరు యువకులు మాటు వేసి ఉన్నారు. ఆమె తండ్రితో సహా ఆలయంలోకి వెళ్లి పూజలు చేసి బయటకు రావడంతో కారులో నుండి కొందరు యువకులు దిగి ఆ యువతి తండ్రిని పక్కకు తోేసేశారు. ఒక యువకుడు ఆమె తండ్రిని గట్టిగా పట్టుకున్నాడు. మరో యువకుడు శాలిని ని బలవంతంగా కారులోకి ఎక్కించాడు. ఆ తరువాత యువతి తండ్రిని ఆ యువకుడు పక్కకు తోసివేసి కారులో ఉడాయించారు.
ఈ ఘటనతో ఒక్క సారిగా నిచ్చేష్టుడైన యువతి తండ్రి.. కారును ఆపేందుకు ప్రయత్నించినా ఉపయోగం లేకుండా పోయింది. వెంటనే కారును పట్టుకునేందుకు బైక్ పై అనుసరించినా కారు వేగంగా వెళ్లడంతో ఏమి చేయలేక వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. తమ కుమార్తె కిడ్నాప్ వెనుక గ్రామానికి చెందిన కటారపు జాన్ ప్రమేయం ఉండవచ్చని శాలిని తల్లిదండ్రులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అక్కడ సీసీ కెమెరా పుటేజ్ పరిశీలించారు. అందులో స్పష్టంగా శాలిని కిడ్నాప్ చేయడం రికార్డు అయి ఉంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కారు నెంబర్ ఆధారంగా నిందితులను పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
ఈ కేసు వెనుక మరో ట్విస్ట్ ఉంది. శాలిని, జాన్ లు ఏడాది క్రితమే ఇంట్లో నుండి జంప్ అయ్యారని గ్రామస్తులు చెబుతున్నారు. అప్పట్లో శాలిని మైనర్ కావడంతో ఆమె తండ్రి ఫిర్యాదు చేయడంతో పోలీసులు వాళ్లిద్దరిని తిరిగి ఇంటికి తీసుకువచ్చారు. యువతి తల్లిదండ్రులకు అప్పగించి జాన్ పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఇటీవల శాలినికి మైనార్టీ తీరడంతో శాలినికి వివాహం చేసేందుకు తల్లిదండ్రులు వేరే యువకుడితో నిశ్చితార్ధం చేశారు. ఈ తరుణంలో శాలిని కిడ్నాప్ కు గురి కావడంతో జాన్ పైనే గ్రామస్తులు, యువతి తల్లిదండ్రులు అనుమానిస్తున్నారు.
Lady kidnapped in front of her father similar to cinematic style..#rajannasiricilla dust (Telangana)..#Doeshumanityexist?#KTR pic.twitter.com/LDGKCe8V1e
— SHRA..1 JOURNALIST✍ (@shravanreporter) December 20, 2022