తెలంగాణలో అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతున్న బీజేపీ ఓ పక్క ఆపరేషన్ ఆకర్ష్ నిర్వహిస్తూనే మరో పక్క సెలబ్రిటీల పరోక్ష మద్దతు కూడగట్టుకునే పనిలో ఉన్నట్లు స్పష్టం అవుతోంది. రాజకీయాలతో సంబంధం లేని ప్రముఖులను తమ వైపు ఆకర్షించుకునే విధంగా వ్యూహాలను సిద్దం చేసుంది. ఈ క్రమంలోనే సినీ సెలబ్రిటీలు ఇళయరాజా, విజయేంద్ర ప్రసాద్, పరుగుల రాణి పీటీ ఉషా లాంటి వారిని రాజ్యసభకు పంపిన బీజేపీ.. తాజాగా మరి కొందరిపైనా దృష్టి పెట్టింది. ఆ క్రమంలోనే రీసెంట్ గా తెలంగాణ పర్యటనకు విచ్చేసిన కేంద్ర మంత్రి అమిత్ షా .. టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్ తో భేటీ అయ్యారు. దాదాపు 20 నిమిషాల సేపు ఇద్దరి సమావేశం జరిగింది. తారక్ తో అమిత్ షా ఎందుకు భేటీ అయ్యారనే విషయంపై రాజకీయ వర్గాల్లో రకరకాల చర్చలు జరుగుతూనే ఉన్నాయి.
ఈ తరుణంలో తాజాగా వరంగల్లు పర్యటనకు విచ్చేసిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపి నడ్డా .. హైదరాబాద్ లో సెలబ్రిటీలతో భేటీ అయ్యారు. శంషాబాద్ సమీపంలోని నోవాటెల్ హోటల్ నందు ముందుగా మిథాలీ రాజ్, ఆ తర్వాత యువ హీరో నితిన్ తో జేపి నడ్డా సమావేశం అయ్యారు. అదే విధంగా అరకు మాజీ ఎంపీ కొత్తపల్లి గీత జేపి నడ్డాను కలిశారు. అలాగే మైహోం గ్రూప్ అధినేత జూపల్లి రామేశ్వరరావు భేటీ అయ్యారు. మైహోం రామెశ్వరరావు ఇంతకు ముందు టీఆర్ఎస్ అధినేత, కేసిఆర్ కు దగ్గరగా ఉండేవారు. ఇటీవల కాలంలో కేసిఆర్ తో కొంత గ్యాప్స్ వచ్చినట్లుగా ప్రచారం జరుగుతోంది. అరకు మాజీ ఎంపీ కొత్తపల్లి గీత త్వరలో బీజేపీ తీర్ధం పుచ్చుకోనున్నారని వార్తలు వినబడుతున్నాయి. అందుకే ఆమె జేపి నడ్డాతో సమావేశమైయ్యారని సమాచారం.
ఈ సెలబ్రిటీల భేటీపై బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ మాట్లాడారు. నితిన్, మిథాలీ రాజ్ లు రాబోయే ఎన్నికల్లో బీజేపీకి ప్రచారం చేయనున్నారని లక్ష్మణ్ చెప్పారు. ప్రచారం చేయడానికి అంగీకరించారని తెలిపారు. ప్రధాన మంత్రి మోడీ సూచనలతోనే జేపి నడ్డా వీరితో భేటీ అయ్యారని తెలిపారు. జూనియర్ ఎన్టీఆర్ తో అమిత్ షా సమావేశంలోనూ రాజకీయ పరమైన చర్చ జరిగిందన్నారు.