నేను మంత్రి పదవి కోసం ఎప్పుడూ ఆశ పడలేదు. మంత్రి పదవి కావాలని కూడా కోరుకోలేదు. జగనన్న ముఖ్యమంత్రి అయితే చాలు. మేమంతా ముఖ్యమంత్రులం అయినట్టే అని భావించాం. జగన్ గారి మనసులో నాకు ఎప్పుడూ స్థానం ఉంటుంది. ఆయన నన్ను చెల్లెలిగా అభిమానిస్తారు. అది చాలు నాకు. అసెంబ్లీ సాక్షిగా.. అందరి ముందు.. రోజమ్మ నా చెల్లి.. ఏ తప్పూ చేయలేదు.. అంటూ జగనన్న చెప్పేసరికి.. నా నోటి నుంచి మాటలు రాలేదు. ఆ మాటలకు నేను జీవితాంతం ఆయనకు రుణపడి ఉంటాను.. అంటూ బావోద్వేగంగా మాట్లాడారు నగరి ఎమ్మెల్యే రోజా.
ఇటీవల ఓ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన మనసులోని మాటలను తన అభిమానులతో పంచుకున్నారు రోజా. అలాగే.. తన రాజకీయ జీవితం గురించి.. సీఎం జగన్ గురించి చాలా ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు.
చిత్తూరు జిల్లాలో రెండు మంత్రి పదవులు ఇచ్చే అవకాశం లేదు. అందులోనూ నాకంటే ఎక్కువ అనుభవం ఉన్న వ్యక్తి, సీనియర్ నాయకులు పెద్దిరెడ్డి ఉన్నారు కాబట్టి.. ఆయనకు మంత్రి పదవి దక్కింది. దానికి నేను ఏ మాత్రం బాధపడటం లేదు. మంత్రి పదవి లేకపోయినా.. నాకు పార్టీలో జగన్ గారు చాలా ప్రాధాన్యం ఇచ్చారు. పెద్దిరెడ్డి కుటుంబంతోనూ నాకు చాలా అనుబంధం ఉంది. ఎంపీ మిథున్ రెడ్డి అంటే కూడా నాకు చాలా గౌరవం.. అని రోజా అన్నారు.
మాకు రాజకీయాలు తెలియవు. పెద్దిరెడ్డి గారిని చూస్తూ పెరిగాం. ఆయనే మాకు రాజకీయంగా అండగా ఉన్నారు. ఇప్పటికీ వాళ్లు మమ్మల్ని సొంత కుటుంబ సభ్యుల్లా చూసుకుంటారు.. అంటూ రోజా చెప్పుకొచ్చారు.