ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మాట తప్పకుండా మడమ తిప్పకుండా అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తూ రాష్ట్ర ప్రజల మనసు చూరగొనడానికి అహర్నిశలూ కష్టిస్తున్నారు.
అయితే వైసిపి ఎమ్మెల్యేల నోటి దూల మాటలు,పోలీసుల చేతలు జగన్ ప్రభుత్వ ఇమేజిని దారుణంగా దెబ్బతీస్తున్నాయి.ప్రతిపక్షాలు విరుచుకుపడ్డానికి వీరే ఆయుధాలు అందిస్తున్నారు. గుంటూరు జిల్లా తాడికొండ ఎమ్మెల్యే డాక్టర్ ఉండవల్లి శ్రీదేవి తన నియోజకవర్గ పరిధిలో ఇసుక ట్రాక్టర్లను పట్టుకున్న ఒక సీఐని ఫోన్లో బెదిరించిన వ్యవహారానికి సంబంధించి విడుదలైన ఆడియో టేప్ సంచలనం రేపటం తెలిసిందే.అదే ఎమ్మెల్యే ఒక వైసిపి కార్యకర్త కు ఫోన్ చేసి నియోజకవర్గ పరిధిలో పేకాట క్లబ్బులు బెట్టి కమీషన్ తీసుకుందామంటూ మాట్లాడిన ఆడియో టేపు కూడా బయటకొచ్చింది.ఇక అనంతపురం జిల్లాలో ప్రభుత్వ విప్, రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ఒక ఇసుక డిపో నిర్వహణ అధికారికి ఫోను చేసి చెప్పుతో కొడతానంటూ మాట్లాడటం వెలుగు చూసింది.
తాజాగా తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు పాదయాత్ర సాగిస్తూ ప్రజల ముందే ఒక మహిళా వాలంటీర్ను తీవ్రంగా దుర్భాషలాడటం జరిగింది.ప్రజల మీద ఫిర్యాదు చేయగా ఆయన అమితంగా స్పందించి ఆ మహిళ వాలంటీర్ను నానా మాటలు అనడంతో ఆమె తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్య ప్రయత్నం వరకు వెళ్లిందంటున్నారు.ఇంకా వెనక్కు వెళితే వైసిపి నెల్లూరురూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి ఒక స్థానిక పత్రికాధిపతి పైనే దౌర్జన్యానికి దిగడం తెలిసిందే.మరోవైపు పోలీసుల చేష్టలు కూడా అతిగా వున్నాయి.తాజాగా కర్నూలు జిల్లాలో నంద్యాలలో ఒక ముస్లిం ఆటో డ్రైవర్ కుటుంబంతో సహా ఆత్మహత్యకు పాల్పడే అంతగా పోలీసులు వేధించారని రాష్ట్రం కోడై కూస్తోంది.తూర్పుగోదావరి జిల్లాలో ఒక దళిత యువకుడికి పోలీసులు శిరోముండనం చేసిన సంఘటన కూడా జరిగింది.
ప్రకాశం జిల్లా చీరాలలో ఒక దళిత యువకుడిని మాస్కు పెట్టుకోనందుకు ఎస్సై కొట్టగా అతను మరణించటం తెలిసిందే. చిత్తూరు జిల్లాలో తన మీద మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తంబళ్లపల్లి ఎమ్మెల్యే ద్వారకనాధరెడ్డిల ప్రోద్బలంతో దాడి జరిగినట్లు దళిత న్యాయమూర్తి రామకృష్ణ చెప్పారుఈ సంఘటనకు సంబంధించి తాను ఫిర్యాదు చేసినా పోలీసులు కేసు కూడా కట్టలేదన్నారు ఉత్తరాంధ్రలో కూడా పోలీసు అకృత్యాలు ఎన్నో ఉన్నాయి.ఇలాంటి సంఘటనల కారణంగా జగన్ ప్రభుత్వం మీద చెరపలేని మరకలు పడుతున్నాయి.పార్టీ ఎమ్మెల్యేలను పోలీసులను జగన్ కనుక కట్టడి చేయలేకపోతే పార్టీ అధినేతగా , సీఎంగా ఆయనే భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుందని రాజకీయ పరిశీలకులు హెచ్చరిస్తున్నారు.ఇక జగన్ గన్ తీయాల్సిన తరుణం ఆసన్నమైందని వారు చెబుతున్నారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?