MLAs poaching case: దేశ వ్యాప్తంగా తీవ్ర సంచలనం, చర్చనీయాంశమైన తెలంగాణ ఎమ్మెల్సీల కొనుగోలు కేసు వ్యవహారంపై రేపు (17వ తేదీ) సుప్రీం కోర్టులో విచారణ జరగనున్నది. ఈ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని తెలంగాణ హైకోర్టు ఇప్పటికే తీర్పు వెల్లడించింది. హైకోర్టు తీర్పును తెలంగాణ సర్కార్ సుప్రీం కోర్టులో సవాల్ చేసింది. సుప్రీం కోర్టులో రేపు విచారణ జరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వ న్యాయవాదులు, పోలీస్ అధికారులు ఢిల్లీకి చేరుకున్నారు. మొయినాబాద్ ఫామ్ హౌస్ లో ఎమ్మెల్యేలతో బేరసారాలు జరుపుతున్నారన్న అభియోగంపై రామచంద్రభారతి, నందకుమార్, సింహయాజీ లను పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యేల కొనుగోలునకు వీరు బేరసారాలు జరిపినట్లుగా వీడియో విజ్యువల్స్ బయటకు వచ్చాయి. ఈ కేసు నేపథ్యంలో బీఆర్ఎస్, బీజేపీ నేతల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు, విమర్శలు, ప్రతి విమర్శల యుద్దం జరిగింది. ఈ కేసులో అనేక ట్విస్ట్ లు చోటుచేసుకున్నాయి.
ఈ దర్యాప్తునకు తెలంగాణ సర్కార్ సీపీ నేతృత్వంలో సిట్ ఏర్పాటు చేసింది. నిందితుల కస్టడీ విచారణ అనంతరం సిట్ అధికారులు పలువురు బీజేపీ కీలక నేతలకు 41ఏ సీఆర్పీసీ నోటీసులు జారీ చేశారు. బీజేపీ జాతీయ నాయకుడు బీఎల్ సంతోష్ తదితర నేతలు నోటీసులపై హైకోర్టును ఆశ్రయించి స్టే పొందారు. ఈ కేసును సీబీఐకి అప్పగించాలంటూ బీజేపీ, నిందితులు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించగా, విచారణ జరిపింది. ఈ క్రమంలోనే నిందితులకు బెయిల్ లభించి జైలు నుండి విడుదల అయ్యారు. తొలుత సింగిల్ బెంచ్ ఇరుపక్షాల వాదనల అనంతరం కేసు విచారణను సీబీఐకి అప్పగిస్తూ తీర్పు ఇచ్చింది.
దీనిపై తెలంగాణ సర్కార్ డివిజన్ బెంచ్ ను ఆశ్రయించగా, సింగిల్ బెంచ్ తీర్పునే సమర్ధించింది. ఈ క్రమంలో సీబీఐ అధికారులు కేసు ఫైళ్లను అప్పగించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి అయిదు పర్యాయాలు లేఖ లు రాసినా ప్రభుత్వం అప్పగించలేదు. సుప్రీం కోర్టు లో తీర్పును సవాల్ చేసేందుకు తగిన సమయం ఇవ్వాలని అప్పటి వరకూ సింగిల్ బెంచ్ తీర్పును సస్పెండ్ చేయాలని ప్రభుత్వం కోరింది. అందుకు హైకోర్టు ధర్మాసనం అంగీకరించలేదు. దీంతో ప్రభుత్వం మరో సారి సింగిల్ బెంచ్ కోర్టును ఆశ్రయించింది. పిటిషన్ విచారణకు స్వీకరించిన సింగిల్ బెంచ్ న్యాయమూర్తి .. సీజే ధర్మాసనం అనుమతి తీసుకోవాలని ఏజికి సూచించారు. సీజే ధర్మాసనంలో ప్రభుత్వం అభ్యర్ధించగా, డివిజన్ బెంచ్ తీర్పుపై సుప్రీం కోర్టులోనే సవాల్ చేయాల్సి ఉంటుందని తెలియజేసింది. మరో పక్క హైకోర్టు ను ప్రభుత్వం సుప్రీం కోర్టులో సవాల్ చేయగా, రేపు విచారణ జరగనున్నది. ఈ కేసులో రేపటి విచారణపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. సుప్రీం కోర్టు ఆదేశాల కొరకు సీబీఐ వేచి ఉన్నది.