హైదరాబాదు: తెలంగాణలో స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఉప ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. వరంగల్, నల్లొండ, రంగారెడ్డి జిల్లాల్లో సాయంత్రం నాలుగు గంటల వరకూ పోలింగ్ కొనసాగనుంది
వరంగల్లో అధికార టిఆర్ఎస్ అభ్యర్థిగా పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థిగా వెంకట్రామిరెడ్డితో పాటు మరో ముగ్గురు స్వతంత్ర అభ్యర్థులు పోటీలో ఉన్నారు.
నల్లగొండలో టిఆర్ఎస్ అభ్యర్థి తేరా చిన్నపరెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి లక్ష్మి, రంగారెడ్డి జిల్లాలో టిఆర్ఎస్ నుండి మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థిగా కొమ్మూరి ప్రతాప్రెడ్డిలు బరిలో ఉన్నారు.
రంగారెడ్డి నియోజకవర్గంలో 811, నల్లగొండలో 1096, వరంగల్ నియోజకవర్గంలో 902 మంది ఓటర్లు ఉన్నారు.
ఓట్ల లెక్కింపు జూన్ మూడన నిర్వహించనున్నారు.
ఆయా నియోజకవర్గాల్లోని ప్రజాప్రతినిధులు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు.
ఆయా పార్టీల అభ్యర్థులు, నేతలు ఓటింగ్ సరళిని పోలింగ్ కేంద్రాలను సందర్శిస్తూ ఓటింగ్ సరళిని పరిశీలిస్తున్నారు.
నల్లగొండలో పోలింగ్ కేంద్రం వద్ద టిఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల ఘర్షణ కారణంగా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇటీవల గెలిచిన కాంగ్రెస్ ఎంపి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అక్కడకు చేరుకోవడంతో గోబ్యాక్ కోమటిరెడ్డి అంటూ టిఆర్ఎస్ నేతలు నినాదాలు చేశారు. టిఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య వాగ్వివాదం, ఘర్షణతో పోలీసులు రంగ ప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. .