వైసీపీలో జగన్ కు వీర విధేయులు ఎక్కువ. ఈ విషయాన్ని మరోసారి ప్రూవ్ చేస్తున్నారో ఎమ్మెల్సీ. తాను జగన్ కు వీర విధేయుడిగా నిరూపించుకోవడం కోసమో, చంద్రబాబుపై కోపమో, కోర్టులపై ధ్వేషమో.. అభిప్రాయం ఏదైనా కానీ.. ప్రస్తుతం ఆయన చేసిన వ్యాఖ్యలు ఏపీలో హాట్ టాపిక్ గా మారాయి. ఆ ఎమ్మెల్సీనే పండుల రవీంద్రబాబు. ‘కోర్టులు జగన్ వెంట్రుక కూడా పీకలేవు’ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు హైకోర్టుకు చేరబోతున్నాయి. టీడీపీ, చంద్రబాబు.. ఎవరిపై కోపం ఉంటే వారిని విమర్శించటం మాని ఏకంగా కోర్టులనే తప్పు పట్టారు. ఇప్పుడు కోర్టులు తామేం చేయగలమో నిరూపించేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది.
ఇదీ.. పండుల ప్రస్థానం..
పండుల రవీంద్రబాబు కోర్టులపై వ్యాఖ్యలు చేసిన తర్వాత హాట్ టాపిక్ గా మారారు. నిజానికి ఆయన రాజకీయ ప్రస్థానం మొదలైంది టీడీపీలో. 2014లో ఆయన టీడీపీ తరపున అమలాపురం ఎంపీగా గెలిచారు. అంతకుముందు సివిల్ సర్వీసెస్ లో ఢిల్లీ స్థాయిలో ఉద్యోగం చేశారు. కేంద్ర సర్వీసుల్లో పని చేసిన ఆయన రాజకీయాలపై మక్కువతో 2014లో టీడీపీలో చేరి ఆ గాలిలో ఎంపీగా గెలిచారు. 2019కి ముందు వైసీపీకి జై కొట్టారు. టీడీపీలో ఉండగా ఎటువంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయని ఆయన ఇప్పుడు వైసీపీలో మాత్రం పరుష వ్యాఖ్యలు చేస్తున్నారు.
కొన్నాళ్లు సైలెంట్ గా ఉన్న జగన్ ఎమ్మెల్సీగా ప్రకటించిన రెండో రోజే కోర్టులపై వ్యాఖ్యలు చేశారు. దీంతో జగన్ తోపాటు ఏకంగా కోర్టు దృష్టిలో కూడా పడ్డారు. ఇప్పటికే కొందరు న్యాయవాదులు ఏకంగా హైకోర్టు సీజేకు ఫిర్యాదు చేస్తున్నారు. పండుల చేసిన వ్యాఖ్యల వీడియో క్లిప్పింగ్స్, పేపర్ కటింగ్స్ సీజేకు మెయిల్ చేశారు. వీటిని పరిశీలించి సుమోటోగా పండులపై కేసు నమోదు చేసే అవకాశం ఉంది.