ఏపిలో జరిగిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో నలుగురు ఎమ్మెల్యేలు అధికార వైసీపీకి షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. నలుగురు ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ కు పాల్పడటంతో 23 ఓట్లతో టీడీపీ అభ్యర్ధి పంచుమర్తి అనురాధ మొదటి ప్రాధాన్యత ఓటుతోనే విజయం సాధించారు. ఈ నేపథ్యంలో ఆ నలుగురు ఎమ్మెల్యేలపై వైసీపీ కీలక నిర్ణయం తీసుకుంది. పార్టీ విప్ ఉల్లంఘించినందుకు నలుగురు ఎమ్మెల్యేలను పార్టీ నుండి సస్పెండ్ చేసినట్లుగా వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. శుక్రవారం సాయంత్రం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు సజ్జల.
ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖరరెడ్డి, అనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిపై వేటు వేసినట్లు చెప్పారు సజ్జల రామకృష్ణారెడ్డి. ఈ నలుగురు క్రాస్ ఓటింగ్ కు పాల్పడినట్లు పార్టీ గుర్తించిందని సజ్జల తెలిపారు. క్రాస్ ఓటింగ్ పై అంతర్గత విచారణ జరిపామన్నారు. దర్యాప్తు తర్వేత నలుగురుపై చర్యలు తీసుకున్నామని తెలిపారు. చంద్రబాబు ఎమ్మెల్యేలను కొన్నారని ఆరోపించారు. తమకు ఉన్న సమాచారం మేరకు భారీ ఎత్తున డబ్పులు చేతులు మారినట్లుగా భావిస్తున్నామన్నారు. ఒక్కొక్కరికి రూ.15 కోట్ల నుంచి రూ.20 కోట్ల వరకూ చంద్రబాబు ఆఫర్ చేశారని ఆరోపించారు. క్రాస్ ఓటింగ్ కు పాల్పడిన వాళ్లకు టికెట్ కూడా ఇస్తామని టీడీపీ చెప్పి ఉండవచ్చని అన్నారు సజ్జల.
టీడీపీ అభ్యర్ధిని రంగంలోకి దింపడంతో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలను వైసీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది. ఏ ఒక్క ఎమ్మెల్యే చేజారకుండా వ్యూహత్మకంగా చర్యలు చేపట్టినా జరగాల్సిన నష్టం జరిగింది. దీంతో టీడీపీ అభ్యర్ధి పంచుమర్తి అనురాధ విజయం సాధించారు. ఈ పరిణామాన్ని వైసీపీ సీరియస్ పరిగణించింది అని చెప్పవచ్చు. దాదాపు రెండు సంవత్సరాలకు పైగా వైసీపీని, ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతూ తీవ్ర స్థాయిలో ఆరోపణలు, విమర్శలు చేస్తున్న రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరామ కృష్ణం రాజుపై ఇంత వరకూ సస్పెన్షన్ వేటు వేయని వైసీపీ .. ఎమ్మెల్యే ఎన్నికల్లో అభ్యర్ధి ఓడి పోవడంతో క్రాస్ ఓటింగ్ కు పాల్పడిన వారిపై వెంటనే వేటు వేసింది. దీన్ని బట్టి చూస్తేనే వైసీపీ ఈ విషయాన్ని ఎంత సీరియస్ గా తీసుకున్నదో అర్ధం అవుతోంది.
మరో పక్క క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిలు మాత్రం పార్టీ అభ్యర్ధికే ఓటు వేశామని చెబుతున్నారు. పార్టీ నిర్ణయించిన అభ్యర్ధికే ఓటు వేశామనీ, తాము క్రాస్ ఓటింగ్ కు పాల్పడలేదని అంటున్నారు. ఇదే క్రమంలో మేకపాటి పార్టీపై సీరియస్ కామెంట్స్ కూడా చేశారు. రాబోయే ఎన్నికల్లో టికెట్ ఇస్తే పోటీ చేస్తా లేకపోతే నా దారి నేను చూసుకుంటా అని కూడా వ్యాఖ్యానించారు.
రాహుల్ గాంధీకి బిగ్ షాక్ .. అనర్హత వేటు వేసిన లోక్ సభ సెక్రటేరియట్