ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఅర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈడీ అధికారులకు ఎమ్మెల్సీ కవిత లేఖ రాశారు. ఈ నెల 9వ తేదీన విచారణకు హజరు కాలేనంటూ ఈడీకి లేఖ ద్వారా తెలియజేశారు. ఈ నెల 15వ తేదీ తర్వాత విచారణకు హజరవుతాననీ కవిత వెల్లడించారు. ఢిల్లీలో ధర్మాకు ఏర్పాట్లు పూర్తి అయ్యాయనీ, ఈ నెల 10వ తేదీన ఢిల్లీలో ధర్నా ఉందనీ అందుకే హజరు కాలేకపోతున్నట్లుగా లేఖలో పేర్కొన్నారు కవిత.
ధర్నా, ఇతర కార్యక్రమాలతో బిజీ షెడ్యుల్ ఫిక్స్ అయిన కారణంగా విచారణకు హజరు కాలేకపోతున్నాననీ, అందుకే సమయం కావాలని కవిత కోరారు. కవిత ఈ విధంగా లేఖ రాయడంతో ఈడీ స్పందనపై ఉత్కంఠ నెలకొంది. వాస్తవానికి ఈడీ రీసెంట్ గా అరెస్టు చేసిన ప్రముఖ వ్యాపారవేత్త అరుణ్ రామచంద్ర పిళ్లై తో కలిపి కవితను విచారించాలని భావిస్తున్నారు. కవితపై 177/A 120/B, 7of PC act కింద ఈడీ కేసు నమోదు చేసింది. 2022 అగస్టు 17న సీబీఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా కవితను అధికారులు విచారించనున్నారు. ఈ తరుణంలో కవిత విజ్ఞప్తిని ఈడీ అధికారులు సమ్మతిస్తారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.
మరో పక్క ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ఎల్లుండి ఎమ్మెల్సీ కవిత నిరాహార దీక్ష చేయనున్నారు. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ డిమాండ్ చేస్తూ కవిత దీక్ష చేయనున్నారు. ఈ దీక్షా శిబిరాన్ని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ప్రారంభించనున్నారు. దీక్షా కార్యక్రమంలో ఉదయం నుండి సాయంత్రం వరకూ పలు విపక్ష పార్టీల కు చెందిన నేతలు పాల్గొననున్నారు. కవిత దీక్షకు జమ్ముకశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా హజరు కానుండగా, దీక్ష ముగింపునకు సీపీఐ కార్యదర్శి డీ రాజా హజరుకానున్నారు. కవిత దీక్షకు సంఘీభావంగా దేశంలోని 18 పార్టీలకు చెందిన నేతలు ఆయా పార్టీల బృందాలు పాల్గొననున్నాయి. కవిత దీక్షకు ప్రత్యేకంగా రాజ్యసభ సభ్యుడు, సీనియర్ న్యాయవాది కపిల్ సిబాల్ హజరుకానున్నారు.
వైఎస్ షర్మిల అరెస్టు .. బొల్లారం పోలీస్ స్టేషన్ కు తరలింపు