వైసీపీ ప్రభుత్వానికి కోర్టులో ఎదురుదెబ్బలు పడటం కామన్ అయిపోయింది. ప్రభుత్వం ఏర్పాటైన ఈ 14 నెలలు దాదాపు 75 అంశాల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోర్టు తీర్పులు వచ్చాయి. వీటిపై వైసీపీ నేతలు చంద్రబాబుతోపాటు ఏకంగా కోర్టులపై కూడా విమర్శలు చేస్తున్నారు. తీర్పులిచ్చిన న్యాయమూర్తులపై కూడా విమర్శలు చేసి కోర్టు నోటీసులు అందుకున్నారు. డాక్టర్ సుధాకర్, నిమ్మగడ్డ వ్యవహారంలో కోర్టు తీర్పులను తప్పుబట్టి జడ్జిలపై వ్యాఖ్యలు చేశారు. దీంతో వైసీపీ నాయకులకు జగన్ పై ఉన్న ప్రేమ ముందు రాజ్యాంగ వ్యవస్థలు, కోర్టుల ముందు తక్కువే అవుతున్నాయి. ప్రస్తుతం రాజధాని అంశంలో హైకోర్టు స్టేటస్ కో ఇచ్చింది. ఇది జగన్ ప్రభుత్వానికి పెద్ద ఎదురుదెబ్బ. ఈ అంశంపై వైసీపీ నేతలు ఎవరూ మాట్లాడలేదు. కానీ.. ఓ ఎమ్మెల్సీ మాత్రం హైకోర్టుకు వ్యతిరేక వ్యాఖ్యలు చేసి రెచ్చిపోయారు.
ఆ ఎమ్మెల్సీ ఏమన్నారంటే..
పండుల రవీంద్రబాబు అందరికీ తెలిసిన పేరే. అమలాపురం నుంచి వైసీపీ ఎంపీగా గెలిచారు. జగన్ అవకాశమివ్వటంలో ఎమ్మెల్సీగా మారారు. ఎంపీ కాకముందు సివిల్స్ అధికారి. సివిల్స్, ఐటీల్లో ఉన్నత హోదాల్లో పనిచేశారు. అనంతరం రాజకీయాల్లోకి వచ్చారు. మొదట్లో టీడీపీ ద్వారా రాజకీయ జీవితం ప్రారంభించారు. కానీ మొన్నటి ఎన్నికల్లో జగన్ కు జైకొట్టారు. ప్రస్తుతం రాజధానిపై కోర్టు తీర్పు అనంతరం పండుల చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. ‘కోర్టులు, జడ్జీలు, చంద్రబాబు అందరూ కలిసినా జగన్ వెంట్రుక కూడా పీకలేరు’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కోర్టు ఆర్డర్ పై వైసీపీ మంత్రులే సైలంట్ గా ఉన్న సమయంలో ఎమ్మెల్సీ వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. జగన్ పై విధేయత చూపేందుకే ఈ వ్యాఖ్యలు చేసుంటారనే నేతలు అభిప్రాయపడుతున్నారు. జడ్జీలపై ఇటువంటి వ్యాఖ్యలు జగన్ కు తలనొప్పులు తెచ్చిపెట్టేవే.
మిగిలిన నేతలు ఎందుకు సైలెంట్ అయినట్టు..
వైసీపీలో ఎటువంటి నిర్ణయమైనా.. కోర్టు నుంచి ఎటువంటి తీర్పులు వచ్చినా స్పందించే నాయకులు ఉన్నారు. రోజా, ఆళ్ల రామకృష్ణారెడ్డి, ధర్మాన, అంబటి, బొత్స, అనిల్.. తదితరులు స్పందిస్తూ ఉంటారు. కానీ.. రాజధాని విషయంలో కోర్టుపై మాత్రం ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు. మరి దీని వెనుక ఉద్దేశాలేంటనేది చర్చనీయాంశంగా మారింది.