కరోనా వైరస్ వల్ల విధించిన లాక్ డౌన్ వల్ల తీవ్రంగా ఇబ్బంది పడ్డ ప్రజలకు ఉపశమనం వచ్చేలా మోడీ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకోబోతోంది. కేంద్ర ప్రభుత్వం కేబుల్ టీవీ లైన్ ద్వారా ఇంటర్నెట్ సేవలను కూడా దేశంలోని ప్రజలకు అందించాలని యోచిస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించిన నిబంధనలను రూపొందించిన మోడీ సర్కార్ త్వరలోనే వాటిని ఆమోదించేందుకు సన్నాహాలు జరుపుతోంది.
ఇకపోతే ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్ కాస్టింగ్ మినిస్ట్రీ వారు దీని కోసం కొన్ని రూల్స్ ను రూపొందించారు. ఈ వారంలోనే డిజిటల్ కమ్యూనికేషన్ కమిషన్ నిర్వహించనున్న భేటీలో దేశంలో ప్రజలు నెట్ వర్క్ సమస్యలు ఎదుర్కొంటున్న విషయంపై సమీక్షించి కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ఇకపోతే లాక్ డౌన్ సమయంలో బ్రాడ్ బ్యాండ్ కనెక్షన్ల డిమాండ్ భారీగా పెరిగింది. ఏకంగా 50 శాతం మేర కొత్త కనెక్షన్లు ప్రజలు తీసుకున్నారు.
లాక్ డౌన్ వల్ల వర్క్ ఫ్రమ్ హోమ్ అలవాటు అయిన వారు దేశంలో లక్షల్లో ఉన్నారు. అలాగే ఎప్పటి నుండో డిజిటల్ ఇండియా వంటి స్కీమ్ ల కింద ప్రజలకు అతి చౌక ధరకే ఇంటర్నెట్ సేవలను అందించాలని చూస్తున్న ప్రభుత్వం ఎట్టకేలకు ఒక కీలక అడుగు ముందుకు వేసింది.
వచ్చే రెండు నెలల్లో ఈ కొత్త రూల్స్ కి సంబంధించిన నిబంధనలను ప్రభుత్వం జారీ చేయనుంది. అలాగే కేబుల్ టీవీ ఆపరేట్లు, ట్రాయ్, టెలికం విభాగాలకు చెందిన వారి నుంచి సలహాలు, సూచనలు తీసుకోనుంది. లైసెన్స్ ఫీజులు, ఏజీఆర్ అంశంపై కూడా చర్చలు జరగనున్నాయి. తాజా నిర్ణయం వల్ల 10 కోట్ల మందికి ఇంటర్నెట్ సేవలు అందుబాటులోకి వస్తాయి.