Modi Govt: దేశంలోని అన్ని రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం ఊహించని షాక్ ఇచ్చింది. ఇప్పటికే పలు రాష్ట్రాలపై కేంద్రం సవతి తల్లి ప్రేమ చూపిస్తుందన్న విమర్శ ఉంది. దీనికి తోడు ఇప్పుడు మరో షాకింగ్ న్యూస్ చెప్పింది కేంద్రం. ఇకపై ఏ సాగునీటి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చినా కేంద్ర ప్రభుత్వం నుండి కేవలం 60 శాతం నిధులు మాత్రమే వస్తాయని స్పష్టం చేసింది. మిగిలిన 40 శాతం నిధులను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే భరించాల్సి ఉంటుందని కేంద్రం తెలిపింది.
Modi Govt: ప్రాజెక్టులో 40 శాతం రాష్ట్ర ప్రభుత్వాలు ముందుగా ఖర్చు చేయాలి
ఇక్కడ మరొక ట్విస్ట్ కూడా ఉంది. కొత్త నిబంధనల ప్రకారం తొలుత రాష్ట్రాలు తమ వాటా నిధులను విడుదల చేసి ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాతనే కేంద్ర ప్రభుత్వ నిధులు విడుదల అవుతాయి. ఈ మేరకు తాజాగా కేంద్ర జలశక్తి శాఖ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు మార్గదర్శకాలను విడుదల చేసింది. జాతీయ ప్రాజెక్టులో 40 శాతం నిధులను రాష్ట్ర ప్రభుత్వాలు ముందుగా ఖర్చు చేయాలంటే అది రాష్ట్రాలకు తలకు మించిన భారమే అవుతుంది.
Modi Govt: ఇకపై ప్రాజెక్టులకు జాతీయ హోదా కష్టతరం
జాతీయ హోదా లభించిన ఇరిగేషన్ ప్రాజెక్టులకు ఇప్పటి వరకూ కేంద్ర ప్రభుత్వం 90 శాతం నిధులను ఇస్తొంది. ఇప్పుడు ఈ మొత్తాన్ని 60 శాతంకు తగ్గించింది. అంతే కాకుండా కేంద్ర నిధులను పొందే ప్రక్రియ కూడా సంక్లిష్టంగా మారనుంది. ఇకపై జాతీయ హోదా కల్పించడం కూడా కష్టతరంగా మారనుంది. ప్రాజెక్టుకు జాతీయ హోదా ప్రకటించేందుకు అన్ని అర్హతలు ఉన్నప్పటికీ ఆ నిర్ధిష్ట సమయంలో అందుబాటులో ఉన్న నిధులు, ప్రభుత్వ ప్రాధాన్యతలను బట్టే జాతీయ హోదా కల్పిస్తారు.
పోలవరంకు 60 శాతం నిదులేనా..?
కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన తాజా నిబంధనలతో ఏపిలోని పోలవరం ప్రాజెక్టుకు కష్టాలు పెరిగే అవకాశాలు కనబడుతున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం నుండి 60 శాతం నిధులు మాత్రమే అందే అవకాశం ఉందన్నమాట. కేంద్రం తీసుకున్నఈ తాజా నిర్ణయంపై వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఏ విధంగా స్పందిస్తారు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.