రానున్న ఎన్నికలలో విజయం సంపాదించి పెట్టే జనాకర్షక పధకాల కోసం వెదుకుతున్న మోదీ ప్రభుత్వం సార్వత్రిక కనీస ఆదాయం (యూనివర్సల్ బేసిక్ ఇన్కం- యుబిఐ) పధకం ద్వారా పేదలకు నేరుగా డబ్బు ఇచ్చే ఆలోచన చేస్తున్నదని ఇండియన్ ఎక్స్ప్రెస్ దినపత్రిక పేర్కొన్నది. అధికారం లక్ష్యంగా ఇప్పటికే ఆర్ధికంగా వెనుకబడిన వర్గాలకు 10 శాతం రిజర్వేషన్ బిల్లు తెచ్చారు. దేశంలోని రైతులకు నేరుగా నగదు సహాయం ప్రకటించే ప్రతిపాదన కూడా బిజెపి ప్రభుత్వ పెద్దల పరిశీలనలో ఉన్నదని ఆ పత్రిక తెలిపింది.
దారిద్య్రరేఖ దిగువన ఉన్న కుటుంబాలకు యుబిఎ పధకం కింద నెలకు 2,500 రూపాయలు ఇవ్వనున్నట్లు ప్రకటించే అవకాశం ఉందని ఇండియన్ ఎక్స్ప్రెస్ పత్రిక తెలిపింది. అభిజ్ఞవర్గాల సమాచారం ప్రకారం ఈ ఆర్ధిక సహాయం గ్రామీణ ప్రాంతాలలోని అయిదుగురు సభ్యుల కుటుంబం పౌష్టికాహార అవసరాలలో సగానికి సరిపోతుందనీ, అదే పట్టణ పేదలయితే మూడింట ఒక వంతు అవసరాలను తీరుస్తుందనీ ప్రభుత్వం లెఖ్కలు వేసింది. ఈ పధకం కోసం 2019 ఏప్రిల్-జూన్ నెలలకు 32,000 కోట్ల రూపాయల బడ్జెట్ ప్రకటించే అవకాశం ఉంది. అయితే రిజర్వ్ బ్యాంక్ నుంచి కేంద్రానికి ఎంత మొత్తంలో నిధులు అందుతాయన్న దానిపై ఇది ఆధారపడి ఉంది.
2017 ఆర్ధిక సర్వేలో యుబిఐ ప్రస్తావన ఉంది. ఇది పరిశీలించదగిన ప్రతిపాదన గానే కనబడుతోందని ఆర్ధికసర్వేలో పేర్కొన్నారు. పేదరికాన్ని తగ్గించేందుకు ఉద్దేశించిన పధకాలకు ఇది ప్రత్యామ్నాయం కాగలదని కూడా ఆర్ధిక సర్వే పేర్కొన్నది. ఇటీవలి రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలకు బిజెపి ప్రకటించిన మానిఫెస్టోలో కూడా దీని ప్రస్తావన ఉంది.