2021 జనవరి 26 రిపబ్లిక్ డే వేడుకలకు బ్రిటన్ దేశ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ ని స్పెషల్ గెస్ట్ గా ప్రధాని మోడీ ఆహ్వానించారు. ఈ క్రమంలో బోరిస్ జాన్సన్ తో మోడీ ఫోన్లో మాట్లాడి ఆహ్వానించడం జరిగింది. వెంటనే జాన్సన్ కూడా అంగీకరించారు. ప్రతి ఏడాది జనవరి 26 వ తారీకు నాడు జరగబోయే గణతంత్ర దినోత్సవానికి బయట దేశానికి చెందిన ప్రముఖులను చీఫ్ గెస్ట్ గా ఆహ్వానించే సాంప్రదాయం ఎప్పటి నుండో కొనసాగుతోంది.
ఇదిలా ఉంటే త్వరలోనే జరగబోయే జీ-7 దేశాల సదస్సులో పాల్గొనాల్సిందిగా ప్రధాని మోడీ ని అంతకుముందు ఆహ్వానించేందుకు బోరిస్ ఫోన్ చేశారు. బోరిస్ ఆహ్వానానికి సానుకూలంగా స్పందించిన ప్రధాని రిపబ్లిక్ దినోత్సవానికి రావాలంటూ ఎదురు ఆహ్వానించారు. 1993లో అప్పటి ఇంగ్లాండ్ ప్రధానమంత్రి జాన్ మేజర్ తర్వాత ఇప్పటివరకు బ్రిటన్ తరఫున ఏ ప్రధాని రాలేదు.
ఇలాంటి తరుణంలో ప్రస్తుత బ్రిటన్ ప్రధాని బోరిస్ గణతంత్ర దినోత్సవాలకు రావటం శుభ పరిణామమని విశ్లేషకులు చెప్పుకొస్తున్నారు. ఒకవైపు శత్రు దేశాలు భారత్ ని చుట్టుముట్టే కార్యక్రమం చేస్తున్న నేపథ్యంలో.. విదేశీయుల సపోర్ట్ ఈ సమయంలో చాలా అవసరమని, ఇలాంటి తరుణంలో మోడీ చాలా చాకచక్యంగా విదేశాల మద్దతు కూడగడుతున్నారు అని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఏది ఏమైనా బోరిస్ ఇండియా కి రావడం వల్ల బ్రిటన్ ఇండియా దేశాల మధ్య బంధం మరింతగా దృఢమవుతుందని పేర్కొంటున్నారు.