ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై గత కొద్దికాలంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వివిధ అంశాల్లో విబేధిస్తున్నారు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే, టార్గెట్ చేస్తున్నారు.
జీఎస్టీ నుంచి మొదలైన ఈ టార్గెట్ చేసే ఎత్తుగడ అనంతరం కాలంలో మరింత ముదిరింది. తెలుగు రాష్ట్రాల నీటి వివాదంలో అయితే తెలంగాణ సీఎం కేసీఆర్ ఓ రేంజ్లో ఫైరయ్యారు. అయితే, తాజాగా కీలక పరిణామంతో తెలంగాణ సీఎం కేసీఆర్కు ఊహించని రీతిలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్పందించారు.
మోదీ ఊహించని పని
తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున వర్షాలు పడుతున్న సంగతి తెలిసిందే. ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కుంటున్న ఈ సమయంలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫోన్ చేశారు. హైదరాబాద్లో పరిస్థితిపై తెలంగాణ సీఎం కేసీఆర్ ద్వారా ప్రధాని ఆరా తీసినట్టు తెలుస్తోంది. ఆయన కూడా హైదరాబాద్, తెలంగాణా మొత్తం మీద తీసుకుంటున్న చర్యల గురించి వివరించినట్టు సమాచారం. అధికార యంత్రాంగం తీసుకున్న చర్యలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. కేంద్రం పూర్తి అండగా ఉంటుందని ప్రధానమంత్రి హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.
జగన్ సైతం మోదీతో
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో మాట్లాడిన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వరదలతో నెలకొన్న పరిస్థితులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆరా తీశారు. వాయుగుండం తీరం దాటిందని ఇప్పుడిప్పుడే సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయని జగన్ వివరించారు. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలపై ఆరా తీయడం ముఖ్యంగా తెలంగాణ సీఎం కేసీఆర్ కేంద్రంపై నిప్పులు చెరుగుతున్న సమయంలో ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. కేంద్రంపై తెలంగాణ సీఎ కేసీఆర్ ఆగ్రహం చల్లార్చే క్రమంలో ఇదో అడుగు అని పలువురు అంచనా వేస్తున్నారు
ఇంకా రెడ్ అలర్ట్లోనే…
ఇదిలాఉండగా, హైదరాబాద్ వాతావరణ శాఖ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రెడ్ అలర్ట్ ప్రకటించింది. దీనికి సంబంధించి హైదరాబాద్ వాతావరణ విభాగం అధికారి రాజారావు ఒక ప్రకటన విడుదల చేశారు. తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. హైదరాబాద్ కూడా భారీ వర్షాల కురిసే జోన్లో ఉంది. భారీ వర్షాలకు తోడు ఈదురు గాలులు కూడా వీచే అవకాశం ఉందన్నారు. అలాగే భారీ వర్షాల కారణంగా రిజర్వాయర్లు ప్రమాదకర పరిస్థితికి చేరే అవకాశం ఉందని చెప్పారు. మంచిర్యాల, పెద్దపల్లి, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, సిద్దిపేట, రాజన్న సిరిసిల్ల, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ, యాదాద్రి భువనగిరి, నాగర్ కర్నూల్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని తెలిపారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?