లేహ్, ఫిబ్రవరి 3: లక్ష్యసిద్ధి లేని సంస్కృతిని, రాజకీయాలను ఈ ఐదేళ్ల పాలనలో దేశం నుండి తరిమికొట్టామని ప్రధాని నరేంద్ర మోది అన్నారు. ఆదివారం జమ్ము, కాశ్మీర్లో మోది పర్యటించారు. విజయపూర్, అవంతిపురా డివిజన్లలో రెండు ఎయిమ్స్ నిర్మాణాలకు మోది శంకుస్థాపన చేశారు. లడక్ యూనివర్శిటీని ప్రారంభించారు.
రాష్ట్రీయ ఉచ్చతర్ శిక్షా అభియాన్ (రూపా) కింద దేశ వ్యాప్తంగా కొత్త ప్రాజెక్టుకు ప్రారంభించారు. 54 డిగ్రీ కళాశాలలు, 11 ప్రొఫెషనల్ కాలేజీలు, ఒక మహిళా యూనివర్శిటీ నిర్మాణాలకు ప్రధాని మోది వీడియో కాన్షరెన్స్ ద్వారా శంకుస్థాపన చేశారు. కిస్టవర్, కుప్వారా, బారాముల్లాలో మూడు మోడల్ డిగ్రీ కాలేజీలకు ప్రధాని శంకుస్థాపన చేశారు.
క్రిస్టవర్లో చీనాబ్ నదిపై నిర్మించనున్న 624మెగావాట్ల కిరి హైడ్రో పవర్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా జరిగిన సభలో ప్రధాని మోది మాట్లాడుతూ గతంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఈ ప్రాంతాన్ని పూర్తిగా విస్మరించిందని విమర్శించారు. బిజెపి పాలనలో అబివృద్ధి ఇలాగే కొనసాగుతుందని మోది అన్నారు. 2019 ఎన్నికల్లోనూ విజయం సాధించి తానే ప్రధానిగా బాధ్యతలు చేపడతానని మోది ధీమా వ్యక్తం చేశారు.
‘నేడు నా చేతుల మీదుగా కొన్ని ప్రాజెక్టు శంకుస్థాపనలు జరిగాయి. ఆ ప్రాజెక్టుల ప్రారంభోత్సవం కూడా నేనే చేస్తాను’ అని మోది స్పష్టం చేశారు.
కేంద్ర ప్రభుత్వ సౌభాగ్య స్కీమ్ కింద జమ్ము కాశ్మీర్లో నూరు శాతం ఇళ్లకు కరెంటు సౌకర్యం ఏర్పాటు చేసిన ఘతన తమ ప్రభుత్వానిదేనని మోది అన్నారు.
ఎలాంటి ఆలస్యం లేకుండా బడ్జెట్లో చిన్న సన్నకారు రైతులకు ప్రకటించిన సాయాన్ని వేగంగా అందజేసే ప్రక్రియ చేపట్టామని మోది తెలియజేశారు. మొదటి విడత సాయంగా అయిదు ఎకరాల్లోపు రైతులందరికీ రెండు వేల రూపాయల సాయం అందేలా కృషి చేస్తున్నామని మోది తెలిపారు. పథకం అమలు కోసం అర్హుల పేర్లు, ఆధార్ నెంబర్లు అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వాలకు మార్గదర్శకాలు జారీ చేశామని మోది అన్నారు.
మోది పర్యటన సందర్భంగా నాలుగు అంచెల భధ్రతా ఏర్పాట్లు చేశారు. సరిహద్దులో భద్రతను కట్టుదిట్టం చేశారు.
ప్రధాని మోది పర్యటనకు నిరసనగా వేర్పాటువాదులు బంద్కు పిలుపు నిచ్చారు. దీంతో హురియత్ కాన్పరెన్స్ చైర్మన్ మిర్వయిజ్ ఉమర్ షరూఖ్ను పోలీసులు గృహ నిర్భంధంలో ఉంచారు.