ఉత్తరప్రదేశ్లోని మొరాదాబాద్ లో ఓ ప్రభుత్వ ఆసుపత్రి ఉద్యోగి కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న 24గంటల వ్యవధిలో మృతి చెందాడు. అయితే అతని మరణానికి టీకాకు సంబంధం లేదని జిల్లా చీఫ్ మెడికల్ ఆపీసర్ పేర్కొన్నారు. ఆసుపత్రిలో వార్డు బాయ్గా పని చేసే మహిపాల్ సింగ్ (46) ఆదివారం సాయంత్రం మృతి చెందాడు. మహిపాల్ సింగ్ కరోనా వ్యాక్సిన్ తీసుకోకముందే అనారోగ్యంతో ఉన్నాడని కుటుంబ సభ్యులు తెలిపారన్నారు. మహిపాల్ సింగ్ శనివారం సాయంత్రం టీకా వేయించుకున్నాడనీ, ఆదివారం సాయంత్రం ఛాతినొప్పి, ఊపిరి పీల్చుకోవడంలో ఇబ్బందికి గురై మృతి చెందాడని చెప్పారు.
అయితే ఇది టీకా దుష్ప్రభావం కాదనీ, టీకా తీసుకున్న తరువాత కూడా శనివారం రాత్రి అతను విధులను నిర్వహించారని చెప్పారు. అతని మృతికి గల కారణాలపై పరిశీలన చేస్తున్నామని చీఫ్ మెడికల్ ఆఫీసర్ ఎంసి గార్గ్ పేర్కొన్నారు. అయితే అతని మరణానికి కార్డియో పల్మనరీ డిసీజ్ కారణమని పోస్టుమార్టం నివేదిక వచ్చినట్లు యుపి ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. దీనిపై మృతుడి కుమారుడు విశాల్ మీడియాతో మాట్లాడుతూ తన తండ్రికి సాధారణ జలుబు, దగ్గు ఉందనీ, టీకా వేయించి ఇంటికి తీసుకువచ్చిన తరువాత మరింత ఎక్కువగా బాధపడ్డారని తెలిపారు.
కాగా ఉత్తరప్రదేశ్ కరోనా టీకా డ్రైవ్ మొదటి రోజు శనివారం 22,643 మందికి టీకా వేసినట్లు ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?