సీబీఐ ఇక వచ్చెయ్. మా రాష్ట్రానికి వచ్చెయ్. “వస్తా.., వస్తా.., వందలాది అధికారులను, ఈ రాష్ట్రంలో కొన్ని కార్యాలయాల ఏర్పాటుకి వనరులను.., ఇక్కడే చాలా కాలం ఉండేలా కావాల్సిన అవసరాలను తెచ్చేసుకో.., మూటాముళ్ళు కట్టేసుకుని వచ్చేసేయ్..! ఇక ఈ పోరు ఆగేలా లేదు. ప్రభుత్వం వెనకడుగు వేయదు, పిటిషనర్లు పోలీసులను నమ్మరు.., కోర్టు పోలీసులను వదలదు., అందుకే మీరే ఇక దిక్కు. ఒక డాక్టర్ రోడ్డుపై గొడవ చేసినా మీరే రావాలి.., ఒక హత్యా కేసుని ఛేదించడానికి మీరే కావాలి.., ఒక రథం కాలినా మీరే దిక్కు.., కోర్టుని తిట్టినా వాళ్ళ పని పట్టడానికి మీరే రావాలి. ఏపీలో ఈ తంతు ఆగదు. ఇంకా చాలా ఉన్నాయి. మీ కోసం వేచి చూస్తున్నాయి.
16 నెలల్లో ఆరు కేసులు..!!
సీబీఐ అంటే ఎక్కడో దేశ రాజధానిలో కార్యాలయం ఉంటుంది. రాష్ట్రానికి ఒక ప్రత్యేక విభాగం ఉంటుంది. తక్కువ సిబ్బందితో వెళ్లదీస్తుంది. దేశ వ్యాప్తంగా సీబీఐకి సిబ్బంది కొరత ఉంది. సుమారుగా 2 వేల మంది సిబ్బది అదనంగా అవసరం ఉంది. ఈ క్రమంలోనే దాదాపు 550 కేసులు పెండింగ్ లో ఉన్నాయి. గత ఏడాదిలో దేశ వ్యాప్తంగా దేశం వ్యాప్తంగా సుమారుగా 420 కేసులు నమోదు కాగా.., ఈ ఏడాదిలో ఇప్పటికే 325 కేసులు నమోదయ్యాయి. ఏపీలోనే గడిచిన 16 నెలల వ్యవధిలో ఆరు కేసులు సీబీఐకి వెళ్లాయి.
వీటిలో కొన్ని సిల్లీ కేసులు, ఇంకొన్ని ప్రభత్వ వైఫల్యాలు కూడా ఉన్నాయి. ఇలా ఇప్పటికే కేసుల సంఖ్య పెరుగుతుండడం.., కొత్తగా మరిన్ని అప్పగిస్తుండడం వారిపై ఒత్తిడి పెంచుతుంది. ఇక్కడితో ఆగదు. ఇప్పటికీ రాష్ట్ర హైకోర్టులో అనేక కేసులు విచారణ దశలో ఉన్నాయి. వీటిలో ఇంకొన్ని సీబీఐకి వెళ్లే ఆలోచనలు ఉన్నాయి. ముఖ్యంగా అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ కేసు.., ఫైబర్ గ్రిడ్ లో లోకేష్ పాత్ర కేసుపై సీబీఐ విచారణ చేయాలంటూ ప్రభుత్వం కోరుతుంది.
ముందున్నాయి అనేక సవాళ్లు..!
ఇప్పటి వరకు సీబీఐకి వెళ్లిన కేసుల్లో ఆ అవసరం ఉందా..? లేదా..? అనేది పక్కన పెడితే అనేక కేసుల్లో ప్రభుత్వానికి కూడా ఒక రకంగా తలవంపులే. అనవసర వివాదాలు కూడా కేంద్ర దర్యాప్తు సంస్థకి వెళ్లాయి. అందుకే కేంద్రం చేతిలో జగన్ అస్త్రంగా మారిపోయారని. బీజేపీ చేతికి ఆయుధాలు ఇచ్చినట్టు ఉంటుందని కొన్ని కామెంట్లు వస్తున్నాయి. ఇప్పటి వరకు ఉన్న కేసులు కాకుండా.., ఏపీ ప్రభుత్వం కోరుతున్నట్టు రాజధాని భూముల్లో ఇన్సైడర్ ట్రేడింగ్ కేసు.., ఫైబర్ గ్రిడ్ కుంభకోణం కూడా సీబీఐకి వెళ్లే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు విశాఖలో వైసీపీ ప్రభుత్వం వచ్చాక అవినీతి, ఇళ్ల పట్టాల పంపిణీలో అధికార పార్టీ ఎమ్మెల్యేలు అవినీతి విషయంలో కూడా పిటిషన్లు పడుతున్నాయి. అన్నిటికంటే ముఖ్యంగా దళితుడికి శిరోముండనం.., చీరాలలో కిరణ్ మృతి కేసులను హైకోర్టు సీరియస్ గా తీసుకుంది. ఇవి కూడా సీబీఐకి అప్పగించే అవకాశం ఉంది అంటూ న్యాయవర్గాల్లో వాదనలు వినిపిస్తున్నాయి.