Motkupalli: తెలంగాణ మాజీ మంత్రి, బీజేపీ నేత మోత్కుపల్లి నర్సింహులు భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేశారు.గత కొంతకాలంగా పార్టీతో అంటీముట్టనట్లుగా ఉంటున్న ఆయన ఇటీవల సీఎం కేసీఆర్ ఏర్పాటు చేసిన దళిత నేతల సమావేశానికి సైతం హాజరయ్యారు.అప్పటి నుండే ఆయన కెసిఆర్ కి జిందాబాద్ కొడతారేమోనన్న అనుమానాలు మొదలయ్యాయి.కాగా పార్టీనేతలకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే మోత్కుపల్లి ప్రగతి భవన్కు వెళ్లటంపై బిజెపి ఆగ్రహం వ్యక్తం చేసింది.దీంతో బీజేపీకి రాజీనామా చేస్తున్నట్లు నరసింహులు ప్రకటించారు. తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మోత్కుపల్లి తన నిర్ణయాన్ని వెల్లడించారు.ఈ మేరకు బిజెపి తెలంగాణ శాఖ అధ్యక్షుడికి అయన లేఖ రాశారు.
బీజేపీలో దళితులకు ప్రాధాన్యత లేదు
బిజెపి లో జరుగుతున్న పరిణామాలపై మనస్థాపానికి గురయ్యానని, దళిత ఎంపవర్మెంట్ మీటింగ్ అని సీఎం మీటింగ్ కు వెళితే తనపై వివాదం సృష్టించారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమావేశానికి వెళ్లడం ద్వారా దళితులకు ఏదైనా మేలు చేకూరుతుందేమో అని తాను సదుద్దేశంతో హాజరయ్యానని,దాన్ని బిజెపి నాయకత్వం వేరే విధంగా చూసిందన్నారు. బిజెపిలో దళితులకు ప్రాధాన్యత లేదని ఆయన ఆరోపించారు.ఈ పరిస్థితుల్లో ఒక దళితుడిగా తాను బిజెపిలో ఉండి ప్రయోజనం లేదని అందుకే రాజీనామా చేస్తున్నానని ఆయన వివరించారు.
వేరే స్కెచ్ ఉందని అనుమానం!
అయితే, దళిత బంధు సమావేశం కన్నా ముందు నుండే మోత్కుపల్లి టీఆర్ఎస్ నేతలతో టచ్ లో ఉన్నారన్న వార్తలు వినిపించాయి.నాగార్జునసాగర్ ఉపఎన్నిక సందర్భంగా కూడా మోత్కుపల్లి నల్లగొండ జిల్లానే అయినప్పటికీ బీజేపీ అభ్యర్థికి పెద్దగా ప్రచారం చేయలేదు అంటారు.తాజాగా మోత్కుపల్లి బీజేపీకి రాజీనామా చేయటంతో ఆయన టీఆర్ఎస్లో చేరటం లాంఛనమే అని వినిపిస్తోంది.ఇక పార్టీలు మార్చటంలో మోత్కుపల్లి నర్సింహులుకు మరొకరు సాటి రారు.తెలంగాణలోని అన్ని రాజకీయ పార్టీలను ఆయన చుట్టేశారు.తెలుగుదేశం,కాంగ్రెస్ బీజేపీలతో ఆయన సహజీవనం చేశారు.తెలుగుదేశం నిజానికి నర్సింహులుకు రాజకీయ భవిష్యత్ కల్పించింది.అయితే ఎప్పటికైనా గవర్నర్ కావాలన్న కోరికతో ఉన్న నర్సింహులు తనకు చంద్రబాబు ఆ పదవి ఇప్పించలేదని కోపం పెట్టుకున్నారు.చివరకు ఎన్ని పార్టీలు మారినా ఆయనకు ఒరిగిందేమీ లేదు.ఆయన రాజకీయ భవిష్యత్ ఎలా ఉంటుందో చూడాలి.